నందిపేట్, జనవరి 27 : మండలకేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో సాధుసమ్మేళనం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సభలకు హాజరైన సాధువులు, ఆయా పీఠాధిపతులకు స్థానిక భక్తులు, మహిళలు మంగళహారతులో ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. భక్తులు వేలసంఖ్యలో తరలిరాగా దైవనామస్మరణతో నందిపేట్ మార్మోగింది. ఆశ్రమం నుంచి మొదలైన ర్యాలీ పెట్రోల్ బంక్ చౌరస్తా, పాత మండలం చౌరస్తా, బస్టాండ్, వినాయక్నగర్, కుమ్మర్గల్లీ, పాతూర్ మీదుగా దాదాపు కిలోమీటర్ మేర కొనసాగింది.
సాధు సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్రెడ్డితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆశ్రమంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావన అలవర్చుకోవాలన్నారు. మంగిరాములు మహరాజ్ ఆధ్వర్యంలో సాధుసమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.