కంఠేశ్వర్, ఫిబ్రవరి 16 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో జాప్యం చేయకుండా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కేసుల దర్యాప్తును వేగవంగా పూర్తిచేసి, నిర్ణీత గడువులోపు చార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసుల దర్యాప్తు పురోగతిపై నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు.
నిందితులు తప్పించుకోకుండా పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి ఆధారాలు సేకరించి, సకాలంలో చార్జ్షీట్ ఫైల్ చేయాలన్నారు. న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న కేసుల్లోనూ లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని సకాలంలో అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని తెలిపారు. పోలీసుశాఖ నివేదికను సత్వరమే పంపిస్తే మిగితా వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమాభివృద్ధి అధికారిణి శశికళ, ఆర్మూర్ ఆర్డీవో వినోద్కుమార్, డీటీడబ్ల్యూవో నాగూరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.