ఖలీల్వాడి, డిసెంబర్ 3 : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరని, ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగితే ప్రతిఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు.
కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్యారంగంతోపాటు క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని సామాన్యులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ నైపుణ్యాన్ని చాటుకుంటున్నారని, కొంతమంది మరింత ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు.
శారీరక లోపం విజయసాధనకు ఏ మాత్రం అడ్డంకి కాదని, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదన్నారు. సంక్షేమ, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యం దక్కేలా కృషిచేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. జనవరిలో పంపిణీ చేయనున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన దివ్యాంగులకు కోటాను అనుసరిస్తూ కేటాయిస్తామని చెప్పారు.
దళితబంధు పథకంలోనూ దివ్యాంగులకు కోటా అమలయ్యేలా చూస్తామన్నారు. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం చేపట్టే ఉద్యోగ నియామకాల్లోనూ దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులను శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలపించిన గేయాలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, డీఆర్డీవో చందర్, డీడబ్ల్యూవో సుధారాణి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.