ఎల్లారెడ్డి రూరల్, జూలై 2: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు కట్టతో పాటు పలు గ్రామాల్లో పాలశీతలీకరణ కేంద్రం, అంగన్వాడీ సెంటర్, నర్సరీ, పీహెచ్సీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సొసైటీ కార్యాలయం, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మొదటగా హాజీపూర్ గ్రామంలో నర్సరీని సందర్శించి, మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గండిమాసానిపేట్లో ఉన్న పాలశీతలీకరణ కేంద్రానికి చేరుకొని, మిషనరీని పరిశీలించారు. పాలశీతలీకరణ కేంద్రం రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని పెద్ద చెరువుకట్టపై కొనసాగుతున్న మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించారు. అక్కడి పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఏఈ వినోద్ను అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా మాచాపూర్ అంగన్వాడీ కేంద్రానికి చేరుకోగా, చిన్నారులు గులాబీపూలు అందించి స్వాగతం పలికారు. చిన్నారులతో మాట్లాడుతూ, పద్యం పాడిన చిన్నారిని ఎత్తుకొని అయన అభినందించారు. కేంద్రానికి సరఫరా అవుతున్న కోడిగుడ్లను కలెక్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి మండలంలోని మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. కేంద్రం ఆవరణలో చెత్తాచెదారం ఉండడం చూసి వెంటనే శుభ్రం చేయించాలని పీహెచ్సీ డాక్టర్ శరత్కుమార్ను ఆదేశించారు. రోగులకు అందుతున్న సేవలు, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్తమాల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. హైస్కూల్ ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న సొసైటీ కార్యాలయానికి వెళ్లి ఎరువులను పరిశీలించారు. చివరగా కలెక్టర్ సఫ్దల్పూర్ గ్రామానికి వెళ్లి ఇటీవల నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు.