ఇందల్వాయి : కులవృత్తుల అభ్యున్నతికీ సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చెరువులో చేపపిల్లలను వదిలారు. అనంతరం గంగమ్మదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మిక కుటుంబాలు బాగుండాలనే ఆలోచనతో ప్రతి చెరువులలో చేప పిల్లలను ఉచితంగా అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.
గత పాలకుల హయాంలో కుల వృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం తీసుకువచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పడమేకాని చేతల్లో చూపించడం లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారిమోహన్, ఎంపీపీ రమేశ్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, సర్పంచ్ సత్తెవ్వ నర్సింలు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్, పార్టీ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ కొరట్పల్లి ఆనంద్, జిల్లా మత్స్య పారిశ్రామిక శాఖ అధికారి ఆంజనేయ స్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.