కామారెడ్డి/ఖలీల్వాడి/ఆర్మూర్, ఆగస్టు 4 ;రూ.లక్ష లోపు పంట రుణాలమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. అప్పుల బాధలు దూరమవుతాయన్న ఆనందం అన్నదాతల్లో వెల్లివిరుస్తున్నది. శుక్రవారం రెండో రోజు కూడా ఊరూరా సంబురాలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు రైతులు క్షీరాభిషేకం చేశారు.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ..పలు మండలాల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రైతురుణ మాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
సీఎం కేసీఆర్తోనే రైతురాజ్యం
బాల్కొండ, ఆగస్టు 4: రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడిలా మారారు. రైతు కేంద్రీకృతంగా వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్..నాలుగేండ్లుగా రైతన్నలు ఎదురుచూస్తున్న ఆకాంక్షను తీర్చేలా రుణమాఫీ ప్రకటించారు. సీఎం కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యం.
– కత్తి అజయ్, రైతు, జలాల్పూర్, బాల్కొండ మండలం
కేసీఆర్కు రుణపడి ఉంటాం..
సాయం చేస్తున్న కేసీఆర్ సర్కార్ను ఎప్పటికీ మరిచిపోం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు ప్రజలకు తప్పుడు సమాచారమే ఇస్తున్నాయి. అలాంటి వారితో రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ సర్కార్ మరోసారి విజయం సాధించడం ఖాయం. రైతుల రుణమాఫీ చేసిన కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– చిన్న రాజన్న, ఉప సర్పంచ్ ఇత్వార్పేట్
రైతుపక్షపాతి కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మళ్లీ నిరూపించుకున్నారు. రైతులను పట్టించుకుంటున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు ఎన్నటికీ మరువలేం. పంట పెట్టుబడికి బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించడం కష్టమైంది. రైతుల కష్టాలు గుర్తించిన కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తున్నామని చెప్పడం సంతోషంగా ఉంది.
-సల్లా నర్సయ్య, రైతు, బాల్కొండ