ఏర్గట్ల, నవంబర్ 3 : కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మన బతుకులు చీకటేనని, మళ్లీ పాత కష్టాలే చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆ పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ లాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. మండలంలోని తడ్పాకల్ గోదావరి ఒడ్డున ఉన్న రామాలయంలో శుక్రవారం పూజలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మిర్యాల్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మంత్రికి మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం వేముల మాట్లాడుతూ.. గ్రామంలో తనకు ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ వివక్ష చూపకుండా అభివృద్ధి చేశానని తెలిపారు. శివారు భూములు పడీత్గా ఉంటే రూ. 11కోట్లతో లిఫ్టును ఏర్పాటు చేయించి మూడు చెరువుల ద్వారా సాగునీటిని అందుబాటులోకి తెచ్చానన్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్, సీసీ, బీటీ రోడ్లు వేయించానని వివరించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరుచేసి పేదలకు అండగా నిలబడ్డానని, ప్రజల మనుసు కరిగి తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నాగేంద్రనగర్, దోంచంద, తాళ్ల రాంపూర్ గ్రామాల్లో మంత్రి ప్రచారం నిర్వహించగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తాను నాగేంద్రనగర్ను గ్రామ పంచాయతీగా చేయించి అభివృద్ధి చేశానన్నారు. సీఎంతో మాట్లాడి దోంచంద పుష్కర్ ఘాట్ను నిర్మించామని గుర్తు చేశారు. తనకన్నా ముందు పనిచేసిన ఎమ్మెల్యేలు ఈ పనులు ఎందుకు చేయించలేదో ఆలోచించాలని కోరారు. దోంచంద అంబేద్కర్ కాలనీని జీపీగా చేసేందుకు సర్వశక్తులా కృషి చేస్తానని మాటిచ్చారు. ఎన్నికలప్పుడు వచ్చి.. చందమామను తెచ్చి మన వాకిట్లో కూర్చోబెడతామని చెప్పే మాయమాటలను నమ్మవద్దని కోరారు. కండ్లముందు ఉన్న అభివృద్ధిని చూసి తనను, కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అమలులోకి వస్తే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని వేముల తెలిపారు. రైతుబంధు రూ.16 వేలు, పింఛన్లు రూ. 5వేలు, దివ్యాంగులకు రూ. 6వేలకు పెరుగుతాయని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 15లక్షల వరకు ఉచిత వైద్యం, కార్మికులందరికీ బీడీ పింఛన్లు, ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా, పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేల చొప్పున లబ్ధి చేకూరుతుందని వివరించారు. కర్ణాటక మాదిరిగా గ్యారంటీల పేరిట ఇక్కడి ప్రజలను కూడా మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, మాయమాటలు నమ్మొద్దని సూచించారు. మంత్రి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి, ఎంపీపీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం, సమన్వయ సభ్యుడు లింగారెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు అష్రాఫ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మధుసూదన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అంజయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.