ఖలీల్వాడి, మార్చి 18: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు ముందే సెంటర్ల వద్దకు చేరుకోగా 9.35 గంటల వరకు హాల్లోకి అనుమతించారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30గంటల వరకు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 21,914 మంది విద్యార్థులకు, 21,870 మంది హాజరుకాగా, 44మంది గైర్హాజరైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. అదనపు కలెక్టర్లతోపాటు డీఈవో, డీఎల్వో, ఫ్లయింగ్ స్కాడ్స్ పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11,962 మందికి 11,940 మంది హాజరుకాగా, 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈవో రాజు తెలిపారు. ప్రైవేట్గా పరీక్ష రాసే 24మంది విద్యార్థులకు ఐదుగురు హాజరయ్యారని, 19 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, వాగ్దేవి హైస్కూల్ను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.