వినాయక్నగర్, జనవరి 21 : విదేశీయులకు భారత పౌరులుగా నకిలీపత్రాలతో పాస్పోర్టులను ఇప్పిస్తున్న ముఠాను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముఠాలో నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణానికి చెందిన సుభాష్ అనే ఏజెంట్ను అదుపులోకి తీసుకొని లోతుగా దర్యాప్తు చేపట్టడడంతో మరిన్ని విషయాలు బయటికి వచ్చినట్లు తెలిసింది.
పాస్పోర్టు పొందాలంటే సంబంధిత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను పాస్పోర్ట్కు దరఖాస్తు చేసుకునే సమయంలో జతచేయడం, పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే పాస్పోర్ట్ మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఉన్నప్పటికీ సదరు ఏజెంట్ నకిలీ ధ్రువపత్రాలతో పాస్పోర్టులు తీయించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఏజెంట్తో ఎస్బీ సిబ్బంది ఎవరైనా టచ్లో ఉన్నారా అనే కోణంలో సైతం ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ముఠా సభ్యుడు తన కార్యకలాపాలు కొనసాగించేందుకు జిల్లాలోని పలు ఇంటర్నెట్ సెంటర్లను వినియోగించుకున్నట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖలీల్వాడి, రాజీవ్గాంధీ ఆడిటోరియం ప్రాంతంతోపాటు భీంగల్ పట్టణంలోని మరో ఇంటర్నెట్ సెంటర్పై దాడి చేసి సీపీయూలను స్వాధీనం చేసుకున్నారు.
ఆధార్, ఏటీఎం, పాస్పోర్ట్, పాన్కార్డులను ప్రభుత్వం దరఖాస్తుదారుని చేతికి అందజేయకుండా పోస్టు ద్వారా సంబంధిత అడ్రస్కు పంపుతుంది. నకిలీ పత్రాలతో తీసిన పాస్పోర్టును దరఖాస్తుదారుడు లేని అడ్రస్కు పోస్టల్వారు ఎలా చేరవేశారు, ఎవరి సంతకం తీసుకున్నారు, నకిలీ వ్యక్తుల చేతికి పాస్పోర్టులు ఎలా చేరాయి లేదా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన ఏజెంటే పోస్టల్ సిబ్బందిని కలిసి పాస్పోర్ట్ తీసుకున్నాడా తదితర అంశాలపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. పాస్పోర్టుల స్కాంలో జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నట్లు పోలీసు అధికారులు ఇప్పటివరకు గుర్తించకుండా ఎలా విధులు నిర్వర్తించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.