నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 25 :జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నూతన వస్ర్తాలు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు కేక్లను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏసుక్రీస్తు జననం, బైబిల్లోని సందేశాలను వినిపించారు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శించిన నాటికలు, వేషధారణ ఆకట్టుకున్నది. పొతంగల్ మండలం కొల్లూర్లోని చర్చిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలోని కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చిలో పాస్టర్ ఇజ్రాయిల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నాటికలు ప్రదర్శించిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.
బర్ధిపూర్లోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో సంఘ కాపరి రెవరెండ్ జి.దినకర్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధర్పల్లిలోని చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్నగర్లోని ఫెయిత్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అబ్రహం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సిరికొండ మండలం కొండాపూర్లోని జీసెస్ లవ్స్ చర్చిలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. పాస్టర్లు రెవరెండ్ ఏసురత్నం, అహరోను క్రీస్తు జననంపై వివరించారు. జిల్లాకేంద్రంలోని నిర్మలహృదయలోని పునీత అన్నమ్మ చర్చిలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు క్రిస్మస్ ఆరాధనను నిర్వహించారు.
చర్చి బృందం ప్రతినిధులు ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఉదయం 5 గంటల నుంచి కంఠేశ్వర్లోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ఆరాధనను నిర్వహించారు. వేడుకల్లో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత పాల్గొని కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్జీవోస్ కాలనీలోని గ్లోరియస్ చర్చిలో బిషప్ రెవరెండ్ బి.పౌల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సండే స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్లోరియస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం సమీపంలో ఉన్న సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు.ప్రార్థనల అనంతరం జగన్ను క్రైస్తవ సంఘ సభ్యులు సన్మానించారు.