కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 16 : ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు, పోడు పట్టాల పంపిణీ, తెలంగాణకు హరితహారం తదితర కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ అవసరమైన మందులు, రీడింగ్ కళ్లద్దాలను తెప్పించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ తుది దశకు వచ్చిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాలను పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. జీవో నెంబర్ 58, 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి పట్టాలను పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం మిగతా వాటికి కూడా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని,ఎక్కడ ప్రభుత్వ భూమి ఉ న్నా తప్పనిసరిగా దానికి కంచె వేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 42,413డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఆ మేరకు లబ్ధిదారుల వివరాలను పొందుపర్చలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించి నిబంధనలకనుగుణంగా వెంటనే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఈనెల 26లోగా పూర్తి చేయాలని గడు వు విధించారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోడు పట్టాలకు సంబంధించిన సమాచారం గతంలోనే అందించామని తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మం తు మాట్లాడుతూ.. జిల్లాలో 1176 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 658 లబ్ధిదారులను గుర్తించామని, సోమవారం నాటికి వారి వివరాలను ఆన్లైన్పోర్టల్ నమోదు చేయిస్తామన్నారు.
వీసీ అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్వో వికాస్ మీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి వీసీలో అదనపు కలెక్టర్లు, వెంకటేశ్ దోత్రే, చంద్రమోహన్, డీఎఫ్వో నిఖిత, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.