ఆదరణ కోల్పోయిన చేనేతకు రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నది. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు నేత కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నది. బతుకమ్మ చీరలతో కోట్ల విలువైన ఆర్డర్లు ఇస్తూ నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అలాగే, యూనిట్ల స్థాపనకు సబ్సిడీలు అందిస్తున్నది. అంతేకాదు, నేతకార్మికులకు బీమా పథకం కూడా అమలు చేస్తున్నది. తాజాగా నేత కార్మికుల కోసం చేనేతమిత్ర పథకాన్ని కేసీఆర్ సర్కారు ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన నేతన్నలకు 3 వేల చొప్పున ఆర్థిక సాయం ఖాతాల్లో జమ చేస్తున్నది. చేనేతమిత్ర పథకంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 50 మందికి లబ్ధి కలుగనున్నది. దీంతో నేత కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. చేనేత ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతున్న వేళ.. వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. బతుకమ్మ చీరలతో రూ.కోట్లు విలువ చేసే ఆర్డర్లు కల్పించి ఉపాధికి ఢోకా లేకుండా చేస్తున్నారు.రాయితీతో యూనిట్లు స్థాపనకు సహకారం అందిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చేనేత కుటుంబాల పొట్ట కొడుతున్నది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసి, నేతన్నల వెన్ను విరిచే నిర్ణయాలతో సామాన్య కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. చేనేత, జౌళి పరిశ్రమలపై 5శాతం జీఎస్టీ విధించడంతో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు కోలుకోలేకపోతున్నారు.
కేంద్ర నిరంకుశ విధానాల కారణంగా రోడ్డున పడుతున్న కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నది. రైతుబీమా తరహాలో చేనేత బీమా, చేనేత పింఛన్లు అమలు చేస్తుండగా.. తాజాగా చేనేత మిత్ర పేరుతో మరో చరిత్రాత్మక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. చేనేత వృత్తి దేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతున్నది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు కృషి చేస్తున్న వృత్తిదారులకు అండగా నిలుస్తున్నది.
రూ.3వేల చొప్పున నగదు జమ
గతంలో చేనేత కార్మికులను పట్టించుకున్న వారు లేరు. స్వరాష్ట్రంలో అడుగకముందే అన్నీ అందిస్తున్నారు. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిలబెట్టుకున్నారు. చేనేత మిత్ర పథకం కింద అర్హులైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రూ.3వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించారు. చేనేత మిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకు నూలు, రంగులు, రసాయనాలకు 50శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే వివిధ కారణాలతో కార్మికులకు సకాలంలో రాయితీ అందడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇకపై జియో ట్యాగింగ్ అయిన ప్రతి మగ్గం కార్మికుడికి నెలకు రూ.3వేలు చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చేనేత దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్ సైతం ప్రకటన చేయగా.. అదిప్పుడు సాకారం అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే చేనేత పనులు జోరందుకుంటున్నాయి. అప్పుల ఊబి నుంచి బయట పడుతున్న కుటుంబాలు సంతోషంగా బతుకుతున్నాయి. వారి జీవనానికి కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు.
ఇప్పటికే చేనేత బీమా అమలు…
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 50 మందికి చేనేత బీమా పథకం వర్తిస్తుంది. కామారెడ్డి జిల్లాలో మగ్గాలు లేకపోవడంతో ఇక్కడ అర్హులెవ్వరూ లేరని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 40 మగ్గాలకు గుర్తింపు ఉన్నాయి. 34 మంది చేనేత కార్మికులతో పాటుగా వీరికి సహాయకులుగా ఉన్న మరో 16 మంది కలిపి మొత్తం 50 మందికి బీమాను అందిస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన ఈ పథకం మూలంగా చేనేత కుటుంబాల్లో సంబురం కనిపిస్తోంది. ప్రభుత్వ జియో ట్యాగ్ లెక్కల ప్రకారం ఇప్పటికే మగ్గాల వివరాలను క్రోడీకరించింది. జియో ట్యాగ్ కలిగిన వారికే ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో ఒక్కో మగ్గానికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున పేర్లు నమోదు చేసింది. 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయసు(60 ఏండ్ల లోపు), జియో ట్యాగింగ్ అయి ఉన్న మగ్గం, మర మగ్గం నేసే కార్మికులు, వారికి అనుబంధంగా ఒక కార్మికుడికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నేతన్నకు చేయూత అనే పేరుతో అమలు చేస్తున్న త్రిఫ్ట్ పథకంలో నమోదైన వారి వివరాల ప్రకారం బీమాను వర్తింపజేస్తున్నారు. చేనేత కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం పూర్తిగా చెల్లిస్తుంది. అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా సొమ్ము అందనున్నది.
కేంద్రం మొండి చేయి…
చేనేత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అనేక పథకాలతో ఆదుకుంటున్నది. చేనేతకు అండగా నిలువాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. స్వదేశీ నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేస్తున్న మోదీ సర్కారు.. వారిని ఆదుకోవడంపై ఆసక్తి చూపడం లేదు. చేనేతను ప్రోత్సహించాల్సిన ఆవశ్యత ఉన్నప్పటికీ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. పరిశ్రమ హోదా ఇచ్చి రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాల్సి ఉండగా..ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా చేనేత వర్గాలకు చేసిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏకంగా 40శాతం పెరిగాయి. పైపెచ్చు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు సైతం అధికం అవుతున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలకు రాయితీలు ఇస్తూ కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోన్న కేంద్ర సర్కారు మాత్రం చేనేత పరిశ్రమపై చిన్నచూపు చూస్తోంది. జీఎస్టీని పెంచడంతో చేనేత, జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది.చేతి కష్టంతో ఎంతో కళాత్మకంగా రూపొందించే చేనేత వస్ర్తాల ధరలు కాస్తా ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే వాటి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండడంలేదు.ఫలితంగా వారంతా ఆర్థికంగా చితికిపోతున్నారు. చేనేత వర్గాలకు సీఎం కేసీఆరే పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.
అర్హులను గుర్తించాం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేనేత మిత్ర పథకానికి సంబంధించి అర్హులను గుర్తించాం. కామారెడ్డి జిల్లా లో మగ్గాలు అంతగా లేవు. నిజా మాబాద్ జిల్లాలో దాదాపుగా 50 మంది వరకు త్రిఫ్ట్ పథకంలో నమోదై ఉన్నారు. వీరిలో మగ్గాల యజమానులు, వీరి సహాయకులకు చేనేత మిత్ర వర్తిస్తుంది. నూలు, రంగులు, రసాయనాల కొనుగోళ్లకు ఈ నగదు ఉపయోగపడుతుంది.
– సంతోష్, అదనపు సంచాలకుడు, చేనేత, జౌళి శాఖ