ఖలీల్వాడి, డిసెంబర్ 10 : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా వేలాది మంది బీడీ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ నుంచి గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు బీడీ కార్మికులు మహాప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ బీడీ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి బీడీలు చుడుతున్నారన్నారు. వారి ఉపాధిని దెబ్బ కొట్టే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని దీన్ని కొట్టాలని పిలుపునిచ్చారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బీడీ వర్కర్స్ యూనియన్ 1972 డిసెంబర్ 10న 30 మంది కార్మికులతో ఏర్పడిందన్నారు. నేడు సుమారు లక్ష మంది కార్మికుల సభ్యత్వంతో దేశంలోనే పెద్దదైన బీడీ కార్మిక సంఘంగా గుర్తింపు పొందిందన్నారు. సభలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్వర్, వెంకన్న, ముత్తెన్న, సుధాకర్, అరుణ్కుమార్, దేవదానం, రామ్లక్ష్మణ్, కిరణ్, సత్తెక్క, బక్కన్న, నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు.