వినాయక్నగర్, జూన్ 23 : ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బృందాలు విస్తృత సోదాలు చేయడం, ఎక్సైజ్ శాఖలో కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు శ్రీనగర్ కాలనీలో ఈఎస్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి.
అనంతరం ఈఎస్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి తమ వెంట తీసుకెళ్లారు. కోట్ల రూపాయల అక్రమాస్తులు బయట పడ్డాయి. జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్లోని ఈఎస్ మల్లారెడ్డి నివాసం, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలోని మద్నూర్ వద్ద గల నర్సయ్యపల్లె ఆయన స్వగ్రామంతో పాటు మిగతా వారి బంధువుల ఇండ్లలో మొత్తం 11 చోట్ల దాడులు నిర్వహించారు. దాడుల్లో ఈఎస్ మల్లారెడ్డికి సంబంధించి కోట్ల రూపాయల్లో అక్రమ ఆస్తులు బయటపడ్డట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈఎస్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద మూడు బ్యాంకు లాకర్లను గుర్తించారు.
బ్యాంకు బ్యాలెన్స్ రూ. 50 లక్షలు, ఆయన ఇంట్లో రూ.3.31 లక్షల నగదు తో పాటు 10.23 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 8 ఓపెన్ ప్లాట్లు, 4 ఇండ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3 కోట్లు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎస్ మల్లారెడ్డి వద్ద లభించిన అక్రమాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం ఏసీబీ అధికారులు వెల్లడించిన విలువలతో పోలిస్తే మరో మూడు నుంచి నాలుగు రేట్లు అధికంగా ఉంటుందని ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. ఈఎస్ మల్లారెడ్డిపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని నాంపల్లిలోని అవినీతి నిరోధకశాఖ ప్రత్యేక కోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపర్చగా ఆయనకు రిమాండ్ విధించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.