సీతాఫలం.. ఈ పేరు వినగానే చిన్నపిల్లాడి నుంచి పండుముసలి వరకు నోరూరుతుంది. సహజసిద్ధంగా లభించే తియ్యని సీతాఫలాలు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి. చలికాలం ప్రారంభం కాగానే విరివిగా లభించే మధురమైన ఫలం సీతాఫలం. అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అనే పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. చూడడానికి అందంగా ఉండి నోరూరించే సీతాఫలం రుచిలోనే కాదు, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సహజసిద్ధంగా చలికాలంలో మాత్రమే లభించే సీతాఫలాలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది.
– కోటగిరి, అక్టోబర్ 7
సీతాఫలంలో విటమిన్(ఏ), మెగ్నీషియం, పొటాషియం, విటమిన్(బీ6), కాల్షియం, విటమిన్(సీ), ఐరన్ తదితర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. విటమిన్(ఏ) ఎక్కువగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం సోడియం, పొటాషియం ఉండడంతో గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అల్సర్, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్ నిరోధకంగా కూడా తోడ్పడుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
పోషకాలు అనేకం..
సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో పోషక విలువలు చా లా ఉన్నాయి. 100 గ్రాముల గుజ్జు నుంచి 94 కేలరీల శక్తి, 20-25 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రాముల ప్రోటీన్లు, 4.4 గ్రాముల పీచు లభ్యమవుతాయి. మాంసకృత్తులు 0.8-1.5 గ్రాములు, చక్కెర గ్లూకోజ్ రూపంలో 20-22, కొవ్వు పదార్థాలు 0.30, క్యాల్షియం 0.02, భాస్వరం 0.04, ఐరన్ 1.00, లవణాలు 0.70, కేలరీలు 1.50, తేమ 0.73 పోషక విలువలు ఉండడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కెరోటిన్, థైమిన్, రిటోప్లేవిస్, విటమిన్(సీ) వంటివి సమృద్ధిగా లభిస్తాయి.
ఆరంభంలో ధరలు అధికం..
సీతాఫలాల ధరలు ఈ ఏడాది ఒకింత ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి పండ్లు వస్తుండడంతో ధర అధికంగా పలుకుతున్నాయి. పరిమాణం బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. సీజన్లో మాత్రమే లభించే సీతాఫలాల ధర ఎంతైనప్పటికీ ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే పండ్లు.. ఈసారి 15 రోజుల ముందుగానే వచ్చాయి. గతేడాది అక్టోబర్లో సీతాఫలాలు నాణ్యత, సైజు మేరకు డజను రూ.100 నుంచి 150 మధ్య లభించాయి.
మహిళలకు ఉపాధి..
జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి కొంతమం ది మహిళలు సీతాఫలాలను పట్టణ ప్రాంతానికి తీసుకువచ్చి నిత్యం ఉపాధి పొందుతున్నారు. అటవీ ప్రాంతం, పంట పొలాల నుంచి ఉదయాన్నే జిల్లా కేంద్రంలోని రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీతాఫలాల విక్రయాలతో రోజుకు రూ.500 నుంచి 700 వరకు ఆదాయం పొందుతున్నారు.