నాలాంటి ముసలోళ్లు కండ్లు కనిపియ్యక చాలా బాధలు వడ్డరు. మేం గరీబోళ్లం. దవాఖానకు బోయి డాక్టర్కు సూపిచ్చుకోవాలంటే బాగా పైసలు తీసుకుంటున్నరు. గిట్లనే కాలం ఎల్లదీద్దం అనుకున్న. అంతట్లనే కండ్ల పరీక్ష చేస్తమని ఇంటికి వచ్చి పేర్లు రాసుకున్నరు. పైసల్ తీస్కోకుంటనే కండ్లు జూసిండ్రు. అద్దాలు, మందులు ఇచ్చిండ్రు. కేసీఆర్ మా లాంటి ముసళ్లకు మంచి సౌలత్ జేసిండు.
-కూనేపల్లి లక్ష్మి, దూపల్లి, రెంజల్
రెంజల్, మే 19: అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడుత కార్యక్రమం మండలంలో విజయవంతంగా పూర్తయ్యింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో జనవరి 18న కంటివెలుగు శిబిరం ప్రారంభమైంది. ఈనెల 17న దూపల్లి గ్రామంలో ముగిసింది. అధికారిక సెలవులు, శని, ఆదివారాల్లో మినహా మిగితా రోజుల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. మండలంలో 43,547 జనాభా ఉంది. 18 ఏండ్లు పైబడిన వారు 20,636 మంది ఉన్నారు. 151 రోజులు నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల్లో దృష్టి లోపం ఉన్న 2,300 మందికి కండ్ల అద్దాలు అందజేశారు. 1,354 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కంటి ఆపరేషన్ కోసం 1009 మందిని జిల్లా దవాఖానకు రిఫర్ చేశారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమం మంచి ఫలితాలను సాధించింది. ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు ఇంటింటీకి వెళ్లి అర్హులను గుర్తించి ఆహ్వాన పత్రాలను అందజేసి కంటివెలుగు కేంద్రానికి తరలించారు. కంటివెలుగు కేంద్రంలో ప్రతి రోజూ 120 నుంచి 130 మందికి పరీక్షలు చేయించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అర్హులందరికీ పరీక్షలు చేయించారు.