బస్సుల ముఖం చూడని గ్రామాలెన్నో.. రవాణా వసతి లేక పల్లె ప్రజల అవస్థలెన్నో. సమైక్య పాలనలో ఆర్టీసీ సేవలు పట్టణాలతో పాటు కొన్ని ఊర్లకే పరిమితమయ్యాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రోడ్డు రవాణా సంస్థ సేవలు విస్తృతమయ్యాయి. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక బస్సులు పల్లెబాట పట్టాయి. పల్లెవెలుగు సర్వీసులు ఊరూరికీ వస్తుండడంతో ప్రజల రవాణా కష్టాలు దూరమయ్యాయి.
సిరికొండ, జూలై 28 : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనే నినాదానికి ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిపూర్ణత చేకూర్చుతున్నారు. ప్రైవేటు వాహనాలతో పోలిస్తే తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేరుస్తున్న ఏకైక సంస్థ ఆర్టీసీ. బస్సులో ప్రయాణించిన వారందరినీ తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ఆదరాభిమానాలు పొందిన పల్లెవెలుగు బస్సులు.. రాష్ట్రప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో గ్రామాలు, తండాల్లో పరుగులు పెడుతున్నాయి. గతంలో రవాణా సదుపాయం సక్రమంగా లేకపోవడంతోపాటు బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ఆర్టీసీ సంస్థ కార్యాచరణ రూపొందించి, అన్నిగ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది. ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో సిరికొండలో ప్రతి మారుమూల పల్లె, తండాలకు సైతం బస్సు సౌకర్యం కలిగింది. మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గతంలో మారుమూల ప్రాంతాలకు సర్వీసులు ఉండేవి కావు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డిని తండాలు, మారుమూల గ్రామాలకు చెందిన వారు తమ ప్రయాణ బాధలను విన్నవించగానే బస్సు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం నిజామాబాద్ డిపో బస్సులు 21 సార్లు సిరికొండ మండలానికి వస్తున్నాయి.
మండలం నుంచి హైదరాబాద్ నగరానికి..
భీంగల్, కామారెడ్డి, ఆర్మూర్, వేములవాడ, సిరిసిల్ల డిపో నుంచి 9 సర్వీసులు వస్తున్నాయి. ఆర్మూర్ డిపొ బస్సు ఆర్మూర్, గడ్కోల్, తూంపల్లి, కామారెడ్డి మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కామారెడ్డి, రావుట్ల, భీంగల్ వెళ్తున్నది. నిజామాబాద్ డిపో బస్సు ఉదయం, సాయంత్రం చీమన్పల్లి గ్రామానికి వస్తున్నది. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. నిజామాబాద్ నుంచి సిరికొండ, చీమన్పల్లి, తాటిపల్లి మీదుగా వేములవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ వరకు బస్సు సౌకర్యం కల్పించారు. మారుమూల ప్రాంతం నుంచి సైతం రాజధానికి బస్సు సౌకర్యం కల్పించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం
గతంలో బస్సుల సౌకర్యం ఇంతగా లేదు. గంటల తరబడి బస్సు కోసం ఎదురుచూసేవాళ్లం. ప్రస్తుతం పది నిమిషాల కొకసారి మా గ్రామానికి బస్సులు వస్తున్నాయి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయడం లేదు. బస్సులు సమయానికి వస్తున్నాయి. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నాం.
-తలారి గంగాధర్, ఎల్ఐసీ ఉద్యోగి, కొండూర్
గ్రామీణ ప్రాంతం నుంచి హైదరబాద్కు బస్సు
గతంలో ప్రధాన బస్టాండ్ల వద్దనే హైదరాబాద్కు వెళ్లే బస్సులు ఉండేవి. గ్రామీణ ప్రాంతాల మీదుగా హైదరాబాద్కు బస్సు సౌకర్యం ఉంటుందని అనుకోలేదు. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో మా గ్రామం మీదుగా కూడా హైదరాబాద్కు బస్సు వెళ్తున్నది. హైదరాబాద్కు ఎప్పుడు వెళ్లినా రాత్రిలోగా గ్రామంలోనే దిగుతున్నాము. దీంతో గ్రామంలో చదువుకునే విద్యార్థులకు ఎంతో సౌకర్యం కలిగింది.
-మలావత్ రాజేందర్, పందిమడుగు