నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31 : నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు. రూరల్ ఎస్సై జి. లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధర్ తన తమ్ముడు, కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మారుతినగర్లో ఉన్న ఇంటికి తాళం వేసి షాపింగ్ నిమిత్తం హైదరాబాద్కు వెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దుంగడులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. ఇంట్లో ఉన్న సుమారు 16 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి పట్టగొలుసులు, రూ.30 వేలు నగదును దోచుకుపోయారు. అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత కానిస్టేబుల్ కుటుంబసభ్యులు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఏసీపీ ఎ.వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జి.లింబాద్రి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.