గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 500 జనాభా గల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మరోవైపు పల్లెల రూపురేఖలు మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. తాజాగా పంచాయతీల నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లాలో 133 జీపీలకు కొత్త భవనాల కోసం రూ.26.60 కోట్లు మంజూరు చేసింది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలతో పాటు శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో గ్రామ పంచాయతీ భవనాన్ని రూ.20 లక్షలతో నిర్మించనున్నారు. బోధన్ నియోజకవర్గానికి 28, ఆర్మూర్ 31, బాల్కొండ 24, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 35 మంజూరయ్యాయి. అలాగే, జిల్లాలో భాగంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 15 పంచాయతీ భవనాలను మంజూరుచేశారు. ఈ భవనాల టెండర్ ప్రక్రియను పూర్తిచేసే పనుల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్శాఖ నిమగ్నమైంది. అన్ని హంగులతో పంచాయతీ భవనాలను నిర్మించనున్నారు.
బోధన్, జనవరి 8: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పల్లెప్రగతి కార్యక్రమంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీరాజ్ చట్టానికి సంస్కరణలు తీసుకురావడంతో ప్రజలకు పాలనా సౌలభ్యం ఎంతో మెరుగుపడింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పల్లెలు అభివృద్ధిబాట పట్టాయి. 500 జనాభా ఉన్న గ్రామాలు, తండాలను గ్రామ పంచాయతీలు మార్చారు. పల్లెలను అన్నింటా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. గ్రామ పంచాయతీలకు కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
నిజామాబాద్ జిల్లాకు 133 కొత్త జీపీ భవనాలు మంజూరు..
కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఇప్పటికే ఉన్న జీపీ భవనాలు కొన్ని శిథిలావస్థకు చేరాయి. దీంతో శిథిల భవనాలతోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని కొత్త పంచాయతీలకు పక్కా భవనాలు సమకూరనుండగా, శిథిలావస్థలో ఉన్న జీపీల స్థానంలో ఆధునిక హంగులతో కూడిన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొత్త, పాత పంచాయతీలు కలిపి 133 భవనాలు మంజూరయ్యాయి. ఈ భవనాల నిర్మాణానికి ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం రూ.26.60 కోట్లు మంజూరు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీ భవనాన్ని రూ.20 లక్షలతో నిర్మించనున్నారు. బోధన్ నియోజకవర్గానికి 28, ఆర్మూర్ నియోజకర్గానికి 31, బాల్కొండ నియోజకవర్గానికి 24, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 35, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో 15 భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి టెండర్లు ప్రక్రియను పూర్తిచేసే పనుల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ నిమగ్నమయ్యింది.
గ్రామాలకు కొత్త శోభ..
పల్లెప్రగతితో ఇప్పటికే గ్రామాల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. హరితహారంతో గ్రామాల్లో పచ్చదనం సంతరించుకున్నది. ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో స్వచ్ఛ గ్రామాలుగా మారాయి. పల్లెప్రకృతి వనాలతో కొత్త అందాలు వచ్చాయి. అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాలు, రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. ఇప్పుడు పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు కావడంతో త్వరలో గ్రామాలు సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి.
మరింత మెరుగ్గా పల్లె పాలన..
500 జనాభా ఉన్న ప్రతి పల్లెనూ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీల నిర్వహణ కోసం పక్కా భవనాల ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతానికి ఇవి తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ముందుగా కొత్త పంచాయతీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. జీపీ భవనాలు లేని లోటును త్వరగా తీర్చాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు సైతం కొన్ని శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా తయారయ్యాయి. జిల్లాలో 50 ఏండ్ల కిందట నిర్మించిన అనేక భవనాలను పైపై మరమ్మతులతో సరిపెట్టి వాటిలోనే కార్యాలయాలను నిర్వహించక తప్పడంలేదు. కొన్ని పంచాయతీలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో భవనాలు చిన్నగా ఉండడంతో పంచాయతీ రికార్డులు, ఇతర సామగ్రి భద్రత, పాలకవర్గాల సమావేశాల నిర్వహణ సమస్యగా మారింది. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఇకపై ఈ సమస్యలన్నీ తీరనున్నాయి.. పంచాయతీలకు పక్కా భవనాల మంజూరుతో పల్లెపాలన మరింత మెరుగుపడనుందని ప్రజలు, సర్పంచులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు పట్టించుకోలేదు..
ఎప్పుడో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో వాటిని పట్టించుకోలేదు. మా గ్రామ జీపీలో సర్పంచ్కు ప్రత్యేక గది కూడా లేదు. భవనమైతే చాలా ప్రమాదకరంగా మారింది. పాలకవర్గ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. శిథిలావస్థకు చేరిన గ్రామ పంచాయతీ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు
-సిర్ప మంజులా సుదర్శన్, సర్పంచ్, అమ్దాపూర్
చాలా సంతోషంగా ఉంది..
మా జీపీ భవనం చాలా పాతది. రికార్డుల నిర్వహణ, పాలకవర్గ సమావేశాలు ఏర్పా టు చేసుకునేందుకు ఈ భవనం సరిపోవడం లేదు.. చిన్న భవనంతో మాకు ఎంతో ఇబ్బంది అవుతున్నది. కొత్త భవనం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
-ధూమాలే మాధవి, సర్పంచ్, హంగర్గ