వేల్పూర్ ,మార్చి 14: గత కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు అసెంబ్లీతోపాటు పలు వేదికల ద్వారాప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదన్నారు. బడి, గుడి, సంఘాలు ఏ ఒక్క పార్టీకి చెందినవికావని, ఇందులో పార్టీలకు అతీతంగా పేదలందరూ లబ్ధిపొందుతారని చెప్పినా ప్రయోజనంలేకుండా పోయిందన్నారు. కండ్ల ముందే పేదలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు ఆగిపోతుంటే దుఃఖం వచ్చిందన్నారు. గురువారం వేముల తన జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు,అభిమానులతో కలిసి వేల్పూర్లో జరుపుకొన్నారు. తన నివాసంలో కేక్కట్ చేశారు.
వేములకు జన్మదిన కానుకగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేసిన ఎంపీ సంతోష్
వేములకు జన్మదిన కానుకగా ఎంపీ సంతోష్ కుమార్ వేల్పూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేశారు.ప్రాథమిక పాఠశాలలో అదనపు గదులకు రూ.కోటీ 3లక్షలు, జడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు గదులకు రూ.20లక్షలు, ఇండోర్ స్టేడియం పనులకు రూ.35లక్షలు, ముదిరాజ్ సంఘ భవనానికి రూ.20 లక్షలు, మసీదులో టాయిలెట్స్ నిర్మాణానికి రూ.2లక్షలు,ఆల్ క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి రూ.5లక్షలు నిధులు మంజూరుచేయగా.
ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే వేముల అందజేశారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. పార్టీలు ముఖ్యంకాదని ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు పని చేయాలని సూచించారు. గతంలో మంజూరైన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగానే తాను ఆవేదన చెందినట్లు తెలిపారు. ఈ విషయమై తనకు అత్యంత ఆప్తుడు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్తో చర్చించగా వెంటనే ఎంపీ నిధుల నుంచి రూ.కోటీ 93లక్షల నిధులు మంజూరు చేశారని వేముల చెప్పారు.