మాక్లూర్, నవంబర్ 25: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే ప్రజల బతుకులు ఆగమవుతాయని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని మానిక్బండార్ తండా, బోర్గాం(కె), కృష్ణానగర్, సింగంపల్లి తండా, మెట్టు, ముబారక్నగర్(ఆర్టీసీ కాలనీ), మాదాపూర్, కల్లెడ గ్రామాల్లో శనివారం ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో జీవన్రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టారు. యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొట్టారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు పలు కులసంఘాలు, ప్రజాసంఘాల పెద్దలు జీవన్రెడ్డిని సత్కరించారు. జై జీవనన్న జైజై కేసీఆర్, జై తెలంగాణ ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా అన్న నినాదాలతో గ్రామాలు మార్మోగాయి. అనంతరం నిర్వహించిన ప్రజాశీర్వాద సభల్లో జీవన్రెడ్డి మాట్లాడారు. తనకు గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషపడ్డాను అంతకు మూడు రెట్లు ఇప్పుడు సంతోషపడ్డానన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రగతి నివేదికలను ప్రజల ముందుంచారు.
మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, మండలంలోని గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని, ప్రతి తండాకు తాగునీటి సౌకర్య కల్పించామని, మండలంలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్డు నిర్మించామని, బోర్గాం(కె), మానిక్బండార్ గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలో విలీనం చేసి అభివృద్ధి మయం చేశామన్నారు. ఆర్మూర్ను రెవెన్యూ డివిజన్, ఆర్మూర్కు 100 పడకల దవాఖాన, ఆర్మూర్లోని అభివృద్ధి ఉట్టి పడేలా 11 బైపాస్ రోడ్లు, సిద్ధుల గుట్టకు రూ.20 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఘాట్ రోడ్డు, ఉమ్మెడ-పంచగూడ బ్రిడ్జి నిర్మాణం , ఆర్మూర్ పట్టణ ప్రతిష్ట చాటేలా అర్బన్ పార్కు చేపట్టామన్నారు. కారు గుర్తుకు మీరేసే ప్రతి ఓటు ప్రగతికి బాట వేస్తుందని, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధే తన అభిమతమని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమని, మళ్లీ తనను దీవించాలని కోరారు. ఆర్మూర్ గడ్డపై అరాచక శక్తులను అడుగు పెట్టనీయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏనాడైనా మీ గ్రామాలకొచ్చారా అని ప్రశ్నించారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. తనను మళ్లీ గెలిపిస్తే ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాక్లూర్, నవంబర్ 25: మండలంలోని మైనార్ట్టీలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి బీఆర్ఎస్కు అండగా నిలిచారు. ముస్లింలు, జమతే కమిటీలు ఆర్మూర్ నియోకజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాక్లూర్ మండలం బోర్గాం(కె) గ్రామానికి వచ్చిన జీవన్రెడ్డికి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి ముస్లింలకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్మూర్టౌన్, నవంబర్25: అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని 25, 26, 27వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితాపవన్ , కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.