టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన అనంతరం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం నిర్వహించిన తొలి సభ ప్రభంజనం సృష్టించింది. పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ సభకు నాందేడ్ జిల్లా నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనప్రవాహం కొనసాగింది. మహారాష్ట్ర ప్రజలు జై కేసీఆర్.. జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలంతా సభను విజయవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు.
జుక్కల్, బోధన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, షకీల్, జీవన్ రెడ్డి, ఎంపీ బీబీపాటిల్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలంతా ..మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులతో కలిసి తొలిసభను దిగ్విజయం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలంతా తెలంగాణలో కలుస్తామంటూ నినదిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. మహారాష్ట్రలోనే తొలి సభ నిర్వహించడంతో విలీనమవుతామని డిమాండ్ చేస్తున్న ఆయా గ్రామాల ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే ఆదర్శవంతమైన పరిపాలన అందుతుందని వారు భావిస్తున్నారు. నాందేడ్ సభతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహారాష్ట్రలోని నాందేడ్ సభ దద్దరిల్లింది. భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతరాష్ట్ర బహిరంగ సభకు అశేష జనం తరలివచ్చారు. నాందేడ్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ను కండ్లారా చూసేందుకు ఎండవేడిమిని సైతం లెక్కచేయకుండా నాందేడ్లోని గురుద్వార్ మైదానంలో జరిగిన సభకు వచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం శ్రద్ధగా విన్న మరాఠీలు జై కేసీఆర్… జై భారత్ అంటూ నినదించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సరికొత్తగా నాందేడ్ సభలో జై మహారాష్ట్ర అంటూ నినదించడం అందరినీ ఆకట్టుకుంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం నాందేడ్ సభను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలంతా సమన్వయం చేసుకుంటూ సభను విజయవంతం చేసేందుకు కృషి చేశారు. జుక్కల్, బోధన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, షకీల్, జీవన్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ నేతలంతా కలిసి మరాఠా బీఆర్ఎస్ నాయకులతో కలిసి తొలిసభను దిగ్విజయం చేశారు. నాందేడ్ సభ సక్సెస్ కావడంతో సరిహద్దు ప్రాంతంలో జోష్ కనిపిస్తున్నది.
సరిహద్దులో ఆనందం..
దాదాపు 2019 సాధారణ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రాజకీయ వేడి రాజుకుంది. సరిహద్దులో ఉన్న అనేక పల్లెటూర్లలో మరాఠా ప్రజలంతా తెలంగాణలో విలీనం అవుతామంటూ నినదించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో దేశంలో గుర్తింపు పొందిన తెలంగాణలో కలుస్తామంటూ మరాఠాలు చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడైనా పథకాలు కావాలంటే రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. ప్రభుత్వాలను నిలదీస్తారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనే కావాలంటూ కోరడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది.
నాడు మొదలైన ప్రజా ఆకాంక్ష రోజురోజుకూ పెరుగుతూ సరిహద్దులోని అనేక గ్రామాలకు పాకింది. నాందేడ్ జిల్లా ధర్మబాద్ తాలూకాలోని సుమారుగా 18 గ్రామాల్లో ఇప్పుడు ఈ చర్చ తీవ్రం అవుతున్నది. జాతీయ రాజకీయాలపై తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మరాఠాల్లో ఆశలను చిగురింప జేసింది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే ఆదర్శవంతమైన పాలన అందుతుందని పొరుగు రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రజలకు దక్కుతున్న సంక్షేమ ఫలాలను తామూ స్వీకరించే అవకాశం ఉందంటూ సంతోషపడుతున్నారు. ఆదివారం నాందేడ్ సభతో సరిహద్దు ప్రాంతాలవారు తెలంగాణలో విలీనం అవుతామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పథకాలకు ఆకర్షణ..
2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ.. అనుకున్న లక్ష్యాలను దాటుకుని పురోగమిస్తోంది. వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతితో దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది. రైతులకు చీకూచింత లేకుండా కేసీఆర్.. అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10వేల చొప్పున అందించడం మహారాష్ట్ర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఎందుకంటే అక్కడి రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దళారులకు అమ్ముకొని వడ్డీకి పావుసేరు చొప్పున ఆదాయం పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నేరుగా రైతుకు పెట్టుబడి పైకం ఇవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నారు. రైతు చనిపోతే బీమా రూపంలో కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం, సాగు కోసం ఉచితంగా 24 గంటలపాటు కరెంట్, సాగునీటి సౌకర్యం, పంటల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవతో మహారాష్ట్ర రైతులంతా వారిరాష్ట్రంలో కొనసాగేందుకు ఇష్టపడడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబ్లీ గ్రామానికి చెందిన ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ను కలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ ట్రెండ్ క్రమంగా విస్తరిస్తూ అనేక గ్రామాలకు పాకుతున్నది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంతో మరాఠీల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. అందుకు బీఆర్ఎస్ నాందేడ్ సభ విజయోత్సవమే నిదర్శనం.