బోధన్/శక్కర్నగర్, మార్చి 22 : రెండు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులతో అతలాకుతలమైన బోధన్ పట్టణం మంగళవారంనాటికి తేరుకున్నది. రెండు రోజుల పాటు మూతపడిన వ్యాపార సంస్థ లు మంగళవారం తెరుచుకున్నాయి.
శాంతి భద్రతలను పర్యవేక్షించిన అధికారులు బోధన్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మం గళవారం సీపీ నాగరాజుతో పాటు పలువురు అధికారులు పర్యవేక్షించారు. నార్త్జోన్ ఐజీ నాగిరెడ్డి, ఐజీ కమల్హాసన్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇందులో భాగంగా వివాదాస్పదం గా మారిన అంబేద్కర్ చౌరాస్తాలో సీపీ నాగరాజు పలువురు పోలీసు అధికారులతో మాట్లాడారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మందిరాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో 144వ సెక్షన్ అమలవుతున్నది. జిల్లా అధికారులతో పాటు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ డాక్టర్ జి.వినీత్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం బంద్ పూర్తిగా కొనసాగగా, మంగళవారం బోధన్ మార్కెట్కు హాలీడే ఉండగా వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి.
బోధన్ పట్టణంలో జరిగిన అల్లర్ల సంఘటనలో ఇరువర్గాలకు చెందిన సుమారు 35 మందిపై కేసులు నమోదు చేసినట్లు బోధన్ పోలీసులు తెలిపారు. కాగా, ఈనెల 21న 15 మందిని రిమాండ్కు పంపగా, మరో 8 మందిని మంగళవారం రిమాండ్కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనల్లో ఓ వర్గంలో ఏ1గా ఉన్న వ్యక్తి మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు, అతన్ని కూడా రిమాండ్కు పంపారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు సంఘటనలో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.