నిజామాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉత్తర భారతదేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అక్కడి కమలం పార్టీ నేతలపై వస్తున్న ఆరోపణలు అన్నీఇన్నీ కావు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో మహిళలపై దాడు లు, లైంగిక వేధింపులు, చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల్లో అత్యధికులు బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు నెరుపుతున్నవారే. రాష్ట్రంలోనూ నిత్య ఘర్షణలకు, ఉద్రిక్తత పరిస్థితులకు బాధ్యత మరిచిన బీజేపీయే కారణమవుతున్నది. పైగా పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్న నేరాలు, ఘో రాల్లోనూ కమలం పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లు బయటికి వస్తుండడం కలకలం రేపుతున్నది. నిజామాబాద్ జిల్లాలో గత ఆరు నెలల్లో వెలుగుచూసిన పలు ఉదంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు నిందితులుగా ఉండడం ప్రజల్లో చర్చనీయాంశంగా మా రింది. చీటికిమాటికి టీఆర్ఎస్పై నోరుపారేసుకునే నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్కు సొంత పార్టీ నేతల ఆగడాలు కనిపించడం లేదా? అని ఇందూరు వాసులు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులను వేధిస్తున్నారని, అనైతిక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎంపీ మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తున్నది.
నవ్విపోదురుగాక నాకేంటి..!
గతవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొత్తగూడెం ఘటనలో స్థానిక ఎమ్మెల్యే కొడుకు రా ఘవ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఓ కు టుంబం ఆత్మహత్యకు కారకులుగా తేలడంతో తక్షణమే స్పందించిన టీఆర్ఎస్ సదరు వ్యక్తిని వెంట నే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పైగా చట్టప్రకారం జరిగే తంతును కొనసాగించింది. మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో తమ చావుకు అసలు విషయాన్ని వెల్లడించడంతో ప్రభుత్వం సైతం సీరియస్గా స్పందించి నిందితులను కటకటాలకు పంపింది. ఎమ్మెల్యే కొడుకైనప్పటికీ ప్రజల మేలు కోసం టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. సీన్ కట్ చేస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారస్తుడి కుటుంబం నాలుగు రోజుల క్రితం వడ్డీ వ్యాపారుల వే ధింపులు తాళలేక విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడింది. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పప్పుల సురేశ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ మరణానికి ని జామాబాద్ నగరానికి చెందిన బీ జేపీ నాయకుడు గణేశ్ ప్రధాన కారకుడంటూ సురేశ్ సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో వీరి మృతికి కారణాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ నాయకుడి దందా తీరును, వేధింపులను మృతుడు పూసగుచ్చినట్లు వివరించి తనువుచాలించా డు. బీజేపీ నాయకుడు గణేశ్ ఆకృత్యాలు అనేకమంటూ మరణానికి కొన్ని క్షణాల ముందు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీ డియాలో వైరల్గా మారాయి. త మ నాయకుడే సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, కమలం పార్టీ ఈ ఘటనపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా వ్యవహరిస్తుండడంపై జిల్లా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
లైంగిక ఆరోపణల్లోనూ బీజేపీ నాయకులే…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారతీయ జ నతా పార్టీకి చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తలు అసాంఘిక, అనైతిక కార్యకలాపాల్లో అడ్డంగా దొరుకుతున్నారు. ఏడాదిన్నర క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.వందల కోట్లతో బోర్డు తిప్పేసిన బీర్షెబా ఉదంతంలోనూ ఏజెంట్లుగా పనిచేసి సామాన్యుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసిన వారిలో అత్యధికులు బీజేపీకి చెందినవారే. బీజేపీ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే బీర్షెబా కార్యాలయా న్ని ప్రారంభించారంటే, తెరవెనుక బాగోతంలో పాత్రధారులను ఇట్టే ఊహించుకోవచ్చు. తాజాగా నిజామాబాద్ నగరంలో వడ్డీ వ్యాపారంతో చెలరేగుతున్న అక్రమార్కుల్లోనూ కమలం పార్టీ వారే అత్యధికులు ఉన్నట్లు తెలుస్తోంది. అనైతిక చర్యల్లోనూ బీజేపీ పార్టీ నాయకులపై ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాలుగైదు నెలలక్రితం నిజామాబాద్ కార్పొరేషన్లోని ఓ బీజేపీ కార్పొరేటర్ భర్త వ్యవహారం కలకలం రేపింది. భార్య, పిల్లలున్నప్పటికీ ఓ మహిళతో వివాహేతర సంబంధా న్ని నెరిపి, సదరు మహిళ తల్లిదండ్రుల చేత చెప్పుదెబ్బలు తిన్న వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అంతలోనే మంగళవారం బీజేపీ యువజన విభాగం, దాని సోదర సంస్థ వీహెచ్పీకి చెందిన ముగ్గురు నాయకులపై ఓ మహిళా కార్యకర్తే లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మా రింది. తనను మూడునెలలుగా వేధిస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని వీహెచ్పీకి చెందిన సదరు మహిళా కార్యకర్త నాల్గో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలు, అనైతికచర్యలకు పా ల్పడకుండా నాయకులను బీజేపీ కట్టడి చేయలేకపోతున్నదా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికీ జంకుతున్నదా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతున్నది.
నోరు విప్పని ఎంపీ అర్వింద్…
తనను ఎన్నికల్లో గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు పంటకు కనీస మద్దతు ధరను కల్పిస్తామంటూ హామీలిచ్చి రైతుల ఓట్లతో నిజామాబాద్ లోక్సభ సభ్యుడిగా గెలిచిన ధర్మపురి అర్వింద్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియాలో, టీవీల్లో నిత్యం నీతులు చెప్పే అర్వింద్కు.. బీజేపీ నేతల అరాచకాలు కనిపించడం లేదా? అని జనం ప్రశ్నిస్తున్నారు. కొత్తగూడెం ఘటనపై బీజేపీ స్పందించినట్లే.. నిజామాబాద్లో వ్యాపారి సురేశ్ కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఎందుకు స్పందించదని వారు నిలదీస్తున్నారు. నేతలపై మరకపడినప్పుడు వారి సచ్ఛీలత నిరూపితమయ్యే వరకు రాజకీయ పక్షాలు వారిని దూరం పెడుతాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీ పరంగానైనా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నా యి. నాలుగైదు నెలల క్రితం ఓ వివాహితను లోబర్చుకున్న కార్పొరేటర్ భర్త కేసులోనూ ఎంపీ అర్వింద్ కనీసం నోరు విప్పలేదు. తాజాగా బీజేపీ నేతల దాడులు, లైంగిక వేధింపులపై నాల్గో టౌన్లో వీహెచ్పీలో పని చేసిన మహిళ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తుండగా… ఠాణా మెట్లు ఎక్కని బీజేపీ నాయకుల దురాగతాలు మరెన్ని ఉన్నాయో? అనే అనుమానాలు సగటు నిజామాబాద్ పౌరులకు కలుగుతున్నది.
బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ సస్పెన్షన్
పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించి.. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నిజామాబాద్కు చెందిన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ను మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్రెడ్డి హైదరాబాద్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు.