డిగ్రీ కళాశాల భూములను అమ్ముకున్నావ్..
రైతులకు న్యాయం చేస్తానని గాయత్రీ షుగర్స్ నుంచి డబ్బులు తీసుకోలేదా?
విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నేత నిట్టు వేణుగోపాల్రావు
కామారెడ్డి, మే 24: అధికారులు, వ్యాపారులను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్రావు సూచించారు. మం గళవారం ఆయన జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆవరణలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఏదో చేస్తానంటూ తనవద్దకు రావాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ కౌన్సిలర్ల అవినీతి విషయంలో తాము చర్చకు సిద్ధమేనని, తేదీ, సమయం, స్థలం ప్రకటించాలని రమణారెడ్డికి సవాల్ విసిరారు. ఆయన పట్టణాభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. దమ్ముంటే కౌన్సిలర్గా పోటీ చేసి గెలువాలని, ఏ వార్డులో పోటీ చేస్తావో చెబితే అక్కడ రాజీనామా చేయడానికి తమ కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుండడంతో గంప గోవర్ధన్ ఐదుసార్లు విజయం సాధించారన్నారు.
కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములను అరోరా కళాశాలకు ధారాదత్తం చేసిన విషయం నిజంకాదా అ ని ప్రశ్నించారు. డబ్బులకు అమ్ముడుపోయావని విమర్శించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తక్కువ ట్యాక్స్ కడుతున్న మాట వాస్తవం కాదా అన్నారు. రమణారెడ్డి ఇల్లు నిర్మాణం జీపీ లేఅవుట్ అనుమతితో చేపట్టగా, 80 ఫీట్ల రోడ్డులో ఉందన్నారు. రోడ్డు నిర్మాణం జరుగకుండా నిలిపివేశారని ఆరోపించారు. జన్మభూమి రోడ్డులోఉన్న తన తండ్రిగారి ఇల్లును కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే ఇద్దరి ఇండ్లు ఒకేసారి కూల్చివేయడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు కోట్లు పెట్టి కాంగ్రెస్ నుంచి బీ ఫాం తెచ్చుకుని విత్ డ్రా ఎందుకు చేసుకున్నావో సమాధానం చెప్పాలన్నారు. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు, స్థానిక గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని నమ్మించి, యాజమాన్యం నుంచి రూ.30 కోట్లు తీసుకుని రైతులను నిండాముంచాడని ఆరోపించారు. గత కలెక్టర్లు సత్యనారాయణ, శరత్పై స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదన్నారు. బెదిరింపు రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం తగదన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి విషయంలో నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ కుంబాల రవీ యాదవ్,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి , కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.