కామారెడ్డి/సుభాష్నగర్, జనవరి 13 ;సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా పాటిస్తారు. ధనుర్మాసం పూర్తయి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగే ఉత్తరాయణ పుణ్యకాలమే సంక్రాంతి. మార్గశిర, పుష్యమాసాల సందికాలంలో హేమంత రుతువులో వచ్చే ఈ పండుగను మూడురోజులపాటు ఉత్సాహంగా జరుపుకొంటారు. మకర సంక్రాం తి తెలుగు రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పర్వదినం. ఈ పండుగ భోగి, మకర సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పాటు జరుపుకొంటారు. 14న భోగి, 15న మకర సంక్రాంతి,16న కనుమ పండుగ ఘనంగా జరుపుకోనున్నారు.
నేడు భోగి..
పుష్యశుద్ధ తదియ ఆదివారం భోగి పర్వదినాన్ని ప్రజలు జరుపుకొంటున్నారు. భోగికి పిడకలు పెట్టి మధ్యలో రంధ్రం చేసి హారంగా తయారుచేస్తారు. ఇంట్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులు, పాత సామన్లు భోగి మంటల్లో వేస్తారు. సూర్యోదయం అనంతరం చిన్నపిల్లలకు కొత్త బట్టలు ధరింపజేసి రేగుపండ్లు, రాగి నాణేలు, చెరుకు ముక్కలు, నువ్వులు కలిపి తలపై నుంచి జారేలా భోగి పండ్లు పోస్తారు. అనంతరం ముతైదువులకు వాయినాలు ఇస్తారు. ఇలా చేయడంతో పిల్లల్లో ఆయుష్షు పెరుగుతుందని, పెద్దల దీవెనలతో చదువులో బాగా రాణిస్తారని ప్రతీతి.
వంటకాల్లో మహిళలు నిమగ్నం
పిండి వంటకాలకు ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి వంటకాల్లో గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా మహిళలు నిమగ్నమయ్యారు. సలసలకాగే నూనె, మూకుడు, వంటల నుంచి వచ్చే పొగ.. గంటల తరబడి కూర్చొని పిండి వంటలే వేయడం. తర్వాత పాత్రలను శుభ్రం చేయడం వంటి కష్టాన్ని మహిళలు ఇష్టంతో చేస్తారు. ఏ ఇంటివైపు చూసినా.. కమ్మని వాసనతో కళకళలాడుతాయి. ఇండ్లన్నీ ఘుమఘుమలాడుతాయి. ప్రతి ఇంటా పిండి వంటలు సిద్ధమవుతున్నాయి. సకీనాలు, గారెలు, బూరెలు చేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు.
రెడీమేడ్ పిండి వంటకాలు…
సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు చేసుకోని వారి కోసం పలు ప్రాంతాల్లో రెడీమేడ్ వంటకాలు చేసున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామాల్లో పలువురు మహిళలు పిండివంటలు చేసి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. ఇంట్లో తయారు చేసుకోలేని వారు వీరివద్ద కొనుగోలు చేసి
రుచి చూస్తున్నారు.
మార్కెట్లో సంక్రాంతి సందడి
పండుగకు కావాల్సిన ముగ్గులు, నోములు, పండ్లు, వస్ర్తాల కొనుగోళ్లు మార్కెట్లో జోరుగాసాగుతున్నాయి. ఏ షాపు చూసినా జనంతో నిండుగా కనిపిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ తదితర పట్టణాల్లోని మార్కెట్లలో నోములు, పిల్లలకు భోగి పండ్లతోపాటు చిలకలు, బత్తీసిల దండలు, రంగవల్లులను అందంగా తీర్చిదిద్దడానికి పలు రకాల ముగ్గులను కొనుగోలు చేస్తున్నారు.