రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గతంలో ప్రజలు నీటి కోసం రోడ్డెక్కే వారని.. ప్రస్తుతం ఎక్కడా అటువంటి పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీకర్ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.
బాన్సువాడ/బీర్కూర్, నవంబర్ 22 : సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోసం రైతులు, తాగునీటి కోసం మహిళలు ఆందోళన చేసేవారని, తెలంగాణ వచ్చాక వారి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోటి ఇండ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోందన్నారు. మంగళవారం ఆయన బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.
రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు అని, రైతుల కష్టాలు తెలిసే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దేశంలో రైతులు చనిపోతే ఎక్కడ కూడా రూపాయి ఇవ్వడంలేదని, కేవలం తెలంగాణలో మాత్రమే రూ.5 లక్షలు బాధిత కుటుంబానికి అందజేస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ వద్దని, మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం రాష్ట్రాన్ని అడిగితే, సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. రైతులు తలెత్తుకు తిరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో అత్యధికంగా 48 లక్షల మందికి ఆసరా పింఛన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. వృద్ధులకు రూ.2,016, వితంతువులకు రూ.3,016 పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు బాన్సువాడలోనే అత్యధికం
రాష్ట్రంలో అత్యధికంగా పదివేల రెండు పడుకల గదుల ఇండ్లు బాన్సువాడ రూ. నియోజక వర్గానికి మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే మూడు లక్షల పథకం వస్తుందని, అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరుచేయిస్తామన్నారు. కేసీఆర్ కిట్లతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. బాన్సువాడలో రూ. 20కోట్లతో మాతాశిశు దవాఖానను నిర్మించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయని, దీంతో ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించడానికి రూ.120 కోట్ల తో సిద్దాపూర్ రిజర్వాయర్, రూ.106 కోట్లతో జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. బరంగేడ్గి గ్రామానికి బైపాస్ రోడ్డుకు రూ. 25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. బీర్కూర్ గై పీర్ల కంకర రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. బరంగేడ్గి గ్రామానికి 35 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు.
బరంగేడ్గిలో సభాపతికి ఘన స్వాగతం
బరంగేడ్గి గ్రామానికి చేరుకున్న సభాపతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.అనంతరం గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన 40 కేఎల్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య, ఆరోగ్య ఉప కేంద్ర భవనం, రూ.10.25 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, రూ.5 లక్షలతో నిర్మించిన ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతిని గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ రాజు, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఏఎంసీ చైర్మన్ గాంధీ, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ పసుపుల లక్ష్మీ రమేశ్, ఎంపీటీసీ సందీప్, రాంబాబు, పుల్లెని బాబు, కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.