బాన్సువాడను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
అన్ని రకాల కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తాం
విద్యతోనే సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యం
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
గిరిజన బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ టౌన్/ నస్రుల్లాబాద్, జనవరి 20: బాన్సువాడను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పేదింటి ఆడబిడ్డలు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల వసతి గృహాలు, కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడ పట్టణ శివారులోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన రూ.1.70 కోట్లతో నిర్మించిన గిరిజన బాలికల వసతిగృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. ఏదైనా అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సహకరిస్తేనే సాధ్యమవుతుందన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు బాన్సువాడ నియొజకవర్గంలో ఒకే కళాశాల ఉండేదని, ప్రస్తుతం 30 కళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.
బాన్సువాడకు కూతవేటు దూరంలో సుమారు 12 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించిన శ్రీ రాం నారాయణ్ ఖేడియాకు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. బాన్సువాడకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడమే కాకుండా భవన నిర్మాణం కోసం రూ.40 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. భవనం ప్రారంభించే వరకు గిరిజన బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల వసతి గృహంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. విద్యార్థినుల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం తన బాధ్యత అని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడం వారి బాధ్యత అని సభాపతి పేర్కొన్నారు.
బాలికలకు విద్య ఎంతో అవసరం
బాలికలకు విద్య ఎంతో అవసరమని సభాపతి అన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక మార్పు వస్తుందన్నారు. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన ప్రతి విద్యార్థి తమ బిడ్డలతో సమానమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా నిధులు రావాలంటే అనేక ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక అవసరమైన నిధులు మంజూరు చేయించుకోగలుగుతున్నామని తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్నాయక్, జడ్పీటీసీలు స్వరూప, పద్మా గోపాల్రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, స్థానిక సర్పంచ్ శ్యామలా శ్రీనివాస్, బాన్సువాడ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఎంపీటీసీ నారాయణ, ఎస్ఆర్ఎన్కే కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హన్సిలీ తదితరులు పాల్గొన్నారు.