కమ్మర్పల్లి, డిసెంబర్ 4 : ప్రజల కోసం.. ప్రజల మధ్యనే ఉండి పని చేసే నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఏ పనైనా అంకిత భావంతో చేస్తే అద్భుత ఆదరణ లభిస్తుందనడానికి నిదర్శనం బాల్కొండ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డికి అందించిన హ్యాట్రిక్ విజయం. వేముల ప్రశాంత్ రెడ్డి ఎంచుకున్న కర్తవ్యంలో అంకిత భావం కనిపిస్తుంది. మలి దశ తెలంగాణ ఉద్యమంతో మొదలై మంత్రిగా ప్రజలకు అందించిన సేవల్లో కనబర్చిన అంకిత భావానికి ఆయనకు బాల్కొండ నియోజక వర్గ ప్రజలు హ్యాట్రిక్ కానుకను అందజేశారు.
ఉద్యమకారుడికి పట్టం
వేముల ప్రశాంత్ రెడ్డి తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ప్రజా రాజకీయాలను చూస్తూ.. కేసీఆర్ అడుగు జాడల్లో తన తండ్రి నడవడం చూస్తూ ఉద్యమ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కేసీఆర్ పిలుపు మేరకు నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు, ఉద్యమ కార్యక్రమాల బాధ్యతలు చూస్తూనే కేసీఆర్ అప్పజెప్పిన పనులను పూర్తి చేసి పెడుతూ కార్యదక్షుడిగా గుర్తింపును పొందారు. దీంతో తొలి సారే 2014లో ప్రజలు ఆయనను జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారు.
ప్రజలిచ్చిన బాధ్యతకు పట్టం కట్టిన వేముల
తొలి సారే జిల్లాలోనే అత్యధిక మెజార్టీ అందించడాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి బాధ్యతగా భావించి కేసీఆర్ వద్ద తనకు ఉన్న ప్రత్యేక ప్రేమ, విశ్వసనీయతను బాల్కొండ నియోజక వర్గ అభివృద్ధికి వినియోగించా రు. అటు కేసీఆర్ సైతం ప్రశాంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తన మానస పుత్రిక మిషన్ భగీరథకు వైస్ చైర్మన్ను చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాలోచనల సమయంలో ఎస్సారెస్పీకి కేసీఆర్ పునర్జీవం పథకాన్ని అందించారు. దానిని ప్రత్యేక కృషితో, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, మంత్రిగా పూర్తి చేయించారు ప్రశాంత్ రెడ్డి. ఎస్సారెస్పీ నాన్ కమాండ్ ఏరియాలో బోరు బావులే శరణ్యమని అసెంబ్లీలో గళం వినిపించి కేసీఆర్ను మెప్పించి ఒకే రోజు 10 విద్యుత్ సబ్ స్టేషన్లు సాధించారు. మొత్తం 18 కొత్త సబ్ స్టేషన్లు నిర్మించి చరిత్ర సృష్టించారు. కొత్త ఎత్తిపోతల పథకాలు తెచ్చి, లక్ష్మీ ఎత్తిపోతల పథకం పూర్తి చేయించి, పాత ఎత్తిపోతలను బాగు చేయించారు.పునర్జీవం పథకం ద్వారా వరద కాలువ, కాకతీయ కాలువలు ఏడాదంతా నీళ్లు ఉండేలా చేసి రైతులకు శాశ్వత ప్రయోజనం అందించారు. భీమ్గల్ను మున్సిపాలిటీగా మార్చారు. దీంతో 2018లో రెండో సారి సైతం బాల్కొండ ఓటర్లు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపును అందించారు.
మంత్రిగా మరుపు రాని అభివృద్ధి అందించి..
రెండో సారి గెలిచాక ఆర్ అండ్ బీ, శాసన సభా వ్యవహారాలు, హౌసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నియోజక వర్గంలో 50కి మించి కుటుంబాలు లేని తండాలకు సైతం బీటీ రోడ్లు, అన్ని గ్రామాల్లో డబుల్ రోడ్లు, అంతర్గత బీటీ రోడ్లు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్, ఫోర్ లైన్ బీటీ రోడ్లు, వాగుల మీద భారీ వంతెనలు నిర్మించారు. కరోనా విపత్తులో ప్రజల వెంటే ఉన్న విలువైన నాయకుడిగా నిలిచారు. కరోనా వేళ ఆక్సిజన్ అందక కన్ను మూసిన బాధాకర దృశ్యాలు చూసి చలించి పోయి తన సతీమణి, మిత్రుల సహకారంతో నియోజక వర్గంలోని అన్ని పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయించి ఇక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి, బాటలింగ్ యూనిట్ పెట్టించి ప్రశంసలు అందుకున్నారు. సుమారు వంద వరకు కొత్త దేవాలయాలు,చర్చిలు, మసీదులకు కొత్త వాటి నిర్మాణానికి, మరమ్మతులకు భారీ నిధులు తీసుకురాగలిగారు. ఇలా రెండో పర్యాయంలో అందించిన భారీ అభివృద్ధి, యువతకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ, మెటీరియల్ అందజేత, జాబ్ మేళా, సుమారు 12 వేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసున్సులు, హెల్మెట్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలు మూడో సారి గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.