లింగంపేట, నవంబర్ 30: అక్రమంగా అటవీభూములను చదును చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజీపేట తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానిక ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముంబాజీపేట తండాలో సోమవారం రాత్రి అటవీ భూమిని చదును చేస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ బీట్ అధికారులు మహేశ్, ఫిరోజ్ ఖాన్ అక్కడికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో నాలుగు ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తున్న కొందరు.. అటవీ శాఖ అధికారుల రాకను గమనించి ట్రాక్టర్లతో సహా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ కింద పడిపోవడంతో డ్రైవర్ను కాపాడేందుకు అటవీశాఖ బీట్ అధికారులు వెళ్లారు. ట్రాక్టర్ యజమాని హన్మంతు, గుర్రం గణేశ్తోపాటు మరో ఇద్దరు దాడి చేయడంతో ఫిరోజ్ఖాన్ తలకు, చేతులకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను వెంటనే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కామారెడ్డికి తరలించారు. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మూడు ట్రాక్టర్లు సీజ్
అటవీ ప్రాంతంలో చదును చేస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు కామారెడ్డి ఎఫ్డీవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం రాత్రి నాలుగు ట్రాక్టర్ల సహాయంతో 801 కంపార్ట్మెంట్లో దున్నుతున్నట్లు సమాచారం రావడంతో బీట్ అధికారులు వెళ్లగా వారిపై దాడిజరిగినట్లు చెప్పారు. నాలుగు ట్రాక్టర్లలో రెండు ట్రాక్టర్లను వదిలిపెట్టిన వ్యక్తులు మరో రెండు ట్రాక్టర్లతో పరారైనట్లు తెలిపారు. మంగళవారం మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఎల్లారెడ్డిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించినట్లు చెప్పారు. ట్రాక్టర్లతో చదును చేసిన భూమిని ఆయన పరిశీలించారు. నిందితులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.