గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవుతున్నది.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఫలాలు ఆవిష్కృతమయ్యే అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రాంపూర్ పంప్హౌస్ నుంచి రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు తరలి వచ్చిన కాళేశ్వరం జలాలను నేటి నుంచి ఎత్తిపోయనున్నారు. ఈ నీళ్లు వరద కాలువ ద్వారా ముప్కాల్ పంప్హౌస్కు, అక్కడి నుంచి శ్రీరాంసాగర్ చెంతకు చేరనున్నాయి. వట్టిపోతున్న వరప్రదాయినిని నిండుకుండలా మార్చేందుకు సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారం కానున్నాయి. చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతలకు.. కదిలొస్తున్న కాళేశ్వరం జలాలు కల్పతరువుగా మారనున్నాయి.
నిజామాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరప్రదాయనిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గత పాలకుల తీరుతో ప్రశ్నార్థకంగా మా రింది. వర్షాలు భారీగా దంచి కొడితే వచ్చే వరదతో మినహా ఇతరత్రా నీటి వనరులే ఈ ప్రాజెక్టుకు దిక్కు లేకుండా పోయింది. ఎగువ మహారాష్ట్రలో గోదావరి నదిపై అక్రమ ప్రాజెక్టులు కట్టడంతో వచ్చే వరద నిలిచిపోయే దుస్థితి. బాబ్లీ గేట్లు ఏటా జూలై 1న తెరిచినప్పటికీ దాంతో కలిగే ప్రయోజనం స్వల్పమే. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షం కురిసి వరద పోటెత్తితేనే పోచంపాడ్ ప్రాజెక్టుకు జలకళ. లేదంటే ఈ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకమే. దిగువ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లా ఆయకట్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎంతో ఉపకరిస్తుంది. లక్షలాది ఎకరాల పంట పొలాలకు జీవం పోస్తుంది. అలాంటి చారిత్రక ప్రాజెక్టు నిత్యం జల కాంతులతో వర్ధిల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణాగా మార్చేందుకు కేసీఆర్ సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహత్తర లక్ష్యంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కూడా ఒకటి. ఈ రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీటిని తరలించి రైతులకు కొండంత భరోసాను కల్పించారు. ఇప్పుడది కండ్ల ముందే సాక్షాత్కారమైంది. కాళేశ్వరం జలాలు నేరుగా వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.
కాళేశ్వరం జలాల ఎత్తిపోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నుంచి మొదలైన ఈ ప్రక్రియ మేడిగడ్డ నుంచి షురూ అయ్యింది. లక్ష్మీ పంప్హౌస్లో 6, సరస్వతీ పంప్హౌస్లో 4, పార్వతీ పంప్హౌస్లో 4 మోటర్లు చొప్పున నడిపించి కాళేశ్వరం నీటిని ఎల్లంపల్లి జలాశయానికి చేర్చుతున్నారు. రెండో లింకులో భాగంగా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్లోకి రెండు మోటర్లతో 6300 క్యూసెక్కులు కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యా ల మండలం రాంపూర్ శివారులోని పంప్హౌస్లో మంగళవారం నుంచి 4 మోటర్లు నడిపిస్తున్నారు. తద్వారా 5800 క్యూసెక్కుల నీటిని వరద కాలువలో ఎత్తిపోస్తున్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా గాయత్రీ పంప్హౌస్లోని రెండు మోటర్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా రాంపూర్ పంప్హౌస్లోకి చేర్చుతున్నారు. ఇక్కడి నుంచి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావు పంప్హౌస్కు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ముప్కాల్ పంప్హౌస్ ద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటిని చేర్చుతారు. ప్రాజెక్టు ఆయకట్టులోని దాదాపు 6.40లక్షల ఎకరాల పంట భూములకు నీరందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిన తర్వాత కాలువ వెంట గల తూములు తెరచి చెరువులను నింపడానికి ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం కాళేశ్వరం జలాల ఎత్తిపోతల ప్రక్రియ దాదాపు 60 రోజుల పాటు సాగనున్నది. ఎల్ఎండీ ఎగువ భాగంలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులందరికీ సాగుకు నీరివ్వాలంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో దాదాపు 50టీఎంసీల మేర నీటి నిల్వ ఉండాలి. ప్రస్తుతం ప్రాజెక్టు లో 20.557 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సారెస్పీ గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు కాగా 1065 అడుగులు మాత్రమే నెలకొన్నది. గతేడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 27.173 టీఎంసీల మేర నీటి నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ప్ర స్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటి నిల్వ ఆధారంగా ఇంకా 30 టీఎంసీల మేర కాళేశ్వరం జలాల అవసరం ఉంది. మొత్తం ఎస్సారెస్పీలో 50 టీఎంసీలకు నీరు చేరితే వానకాలం సీజన్లో ఎల్ఎండీ వరకు ఆయకట్టు ఢోకా ఉండదు.
వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన మేర వర్షాలు కురవకున్నా కాళేశ్వరం అనుసంధానంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి అవసరాలను తీర్చే జల కల్పవల్లిగా అవతరించింది. సీజన్ ప్రారంభంలో అవసరమైన నీటిని జలాశయంలోకి ఎత్తిపోయడం ద్వారా ఆయకట్టు రైతులకు భరోసా నింపుతున్నది. తాగు, సాగునీటి అవసరాలకు ఆటంకం లేకుండా బహుళ ప్రయోజనకారిగా మారింది. గోదావరి జీవనది, పరీవాహక ప్రాంతంలోని వాగులు, వంక లు తన గుప్పింట్లో ఒడిసి పెట్టుకుని సంగమ స్థానంగా జలాశయం అరుదైన గుర్తింపును పొందబోతున్నది. ఓ వైపు గ్రావిటీ ద్వారా వచ్చి చేరే వరద, మరోవైపు వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తిపోసేందుకు వీలుగా అనుసంధానం చేసిన రిజర్వాయర్లతో మూడు కాలాలు జలసిరి సంతరించుకునే విధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పేరుగాంచింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై నీలినీడలు కమ్ముకునే పరిస్థితుల్లో కాళేశ్వరం ఎత్తిపోతల జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానం చేయడం కలిసి వస్తోంది.
రెండురోజులుగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో సుమారు 65 కిలోమీటర్లపైగా వరదకాలువ నిండుకుండలా మారింది. వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన గేటు నుంచి 73 కిలోమీటర్వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంపుహౌస్ గేటు వరకు అర టీఎంసీ, అలాగే రాంపూర్ పంపుహౌస్ ఎత్తిపోస్తున్న నీరు 34 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన రాజేశ్వర్రావు పేట పంపుహౌస్కు నీరు చేరుకున్నది. దీంతో 65 కిలోమీటర్ల పొడవునా వరదకాలువ నిండుకుండలా మారింది. దాదాపు ఒక టీఎంసీ నీరు ప్రస్తుతం వరదకాలువలో ఉందని అధికారులు చెబుతున్నారు.
మల్యాల మండల రాంపూర్ పంపుహౌస్ నుంచి నీరు ఎత్తిపోస్తుండగా.. బుధవారం సాయంత్రానికి మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు చేరుకున్నాయి. రాత్రి వరకు ఫోర్బే వద్ద 324.50 మీటర్ల వరకు నీటి మట్టం చేరుకోనుండగా, ఉదయం మోటర్లతో ఎత్తిపోస్తారు. నేడో, రేపో జలాలు ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు చేరుకుంటాయి.
మరోవైపు వరద కాలువ వెంట 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. బుధవారం నుంచే తూముల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలిస్తున్నారు.
బాల్కొండ : కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని వరద కాలువలో ఏడాదంతా నీటి నిల్వ ఉండడంతో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది. వర్షాభావ పరిస్థితుల్లోనూ రెండు పంటలను సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి. రైతులకు నిరంతరాయంగా ఉచిత కరెంటు ఇస్తుండడంతో పంటలు ఎండిపోతాయన్నా భయం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు.
-అనుగుల రాంరాజ్గౌడ్, కిసాన్నగర్, రైతు
వరద కాలువలో నిత్యం నీరు ఉండడంతో నా సొంత భూమి మూడెకరాలు, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. నా భూమి మొత్తం వరద కాలువపై ఆధారపడి ఉండడంతో గతంలో యాసంగి పంటలు వేసేందుకు భయపడేవాడిని. కానీ రివర్స్ పంపింగ్ రావడంతో అనుకున్న సమయానికి రెండు పంటలు సునాయాసంగా వేసుకుంటున్నాను.
-కొండ అశోక్, కిసాన్నగర్, రైతు
రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలా లు అందిస్తుండడంతో రంది లేకుండా పో యింది. వరద కాలువలో నిత్యం నీరు ఉండడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు నిరంతరాయంగా ఉచిత కరెంటు సరఫరా చేస్తుండడంతో నిర్భయంగా పంటలు వేసుకుంటున్నాం. రైతుల గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు.
-దేవన్న, వన్నెల్(బీ),
రివర్స్ పంపింగ్ ద్వారా వరద కా లువలో నీరు నింపడంతో వర్షాలు కురవకపోయినా మా గ్రామంలో పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటున్నాం. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుచూపుతో పంటను కాపాడేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
-జక్క మోహన్, బోదేపల్లి