మెండోరా, జనవరి 19 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టును అసోం రాష్ర్టానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల బృందం గురువారం సందర్శించింది. బృందంలో ధీరాజ్ సాకియా, డైరెక్టర్లు సయ్యద్ ముహిబర్, నహబయన్, కార్యదర్శి అరూప్కుమార్, ఈఈ గోపాల్, సార్జిబ్ భట్టచార్య ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద, దిగువ గోదావరిలోకి విడుదల చేసే వివరాలను తెలుసుకొన్నారు. వరదగేట్లు, ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు విడుదల చేసే కాలువలను పరిశీలించి సాగునీటి, పంటల వివరాలను సేకరించారు. హెడ్ రెగ్యులేటర్, కాకతీయ, వరదకాలువ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించారు. ఏ కాలువ నుంచి ఎన్ని జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. గుజరాత్లోని ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. అసోం రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ రాష్ర్టాల్లోని ప్రధాన ప్రాజెక్టులను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈలు వంశీ, రవి, మాధురి, నయనారెడ్డి, సిబ్బంది శ్రీకాంత్, సాయి, వంశీ ఉన్నారు.