కోటగిరి, ఫిబ్రవరి 2 : ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. మొదటి విడుతలో భాగంగా కోటగిరి మండలవ్యాప్తంగా 12 పాఠశాలలను ఎంపిక చేశారు. పొతంగల్ మండలం కొడిచెర్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.8.92 లక్షలు మంజూరు చేశారు. కొడిచెర్ల పాఠశాలలో విద్యుత్ సౌకర్యంతో పాటు తాగునీరు, మరమ్మతులు, అన్ని రకాల వసతులు కల్పించారు.
మొదటగా శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతులు చేశారు. ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ, కిచెన్షెడ్డు, నూతన తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపట్టారు. పాఠశాలల్లో ఇప్పటివరకు మరమ్మతు పనులు, నీటి వసతి, టాయిలెట్స్ పనులు పూర్తయ్యాయి. కొడిచెర్ల పాఠశాలలో దాదాపు అన్ని పనులు పూర్తి కావడంతో పాఠశాలలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులు 90 శాతం పూర్తయ్యాయని మండల అధికారులు తెలిపారు.