కామారెడ్డి, ఏప్రిల్ 18 : కామారెడ్డి పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ఐదేండ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట గ్రామానికి చెందిన లక్ష్మికి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్తో 2014లో వివాహమైంది. వీరికి కూతరు సమీరా(8), కుమారుడు శ్రావణ్ (5) ఉన్నారు. కుటుంబంలో కలహాలు రావడంతో లక్ష్మి తన భర్తకు దూరంగా పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నది. ఆరు నెలలుగా లక్ష్మీనర్సింహులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో తమకు పిల్లలు అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో శుక్రవారం లక్ష్మి పని మీద బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కుమారుడు శ్రావణ్ను లక్ష్మీనర్సింహులు గొంతు పిసికి, నోరు, ముక్కు మూసి నేలకేసి కొట్టి కండ్లల్లో కారంపొడి పోసి దారుణంగా హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. లక్ష్మి బాబాయ్ రమేశ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేశామని సీఐ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు లక్ష్మి, లక్ష్మీ నర్సింహులు ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. తమకు కుమారుడు అడ్డువస్తున్నాడనే కారణంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం హత్యచేసినట్లు సీఐ తెలిపారు.