ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా జిల్లాలో శనివారం ఆందోళనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించి మోదీ, ఈడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కవిత అరెస్టును ఖండిస్తూ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు డిచ్పల్లికి తరలివచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మోదీ, ఈడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా మండలకేంద్రాల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దిష్టిబొమ్మలను దహనం చేశారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 16
డిచ్పల్లి, మార్చి 16 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బలహీనపర్చడానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయించిందని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. ఆమె అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బకొట్టడానికి బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే అరెస్టు చేయడం అన్యాయమని, కవిత నిర్దోషిగా బయటికి వస్తారని పేర్కొన్నారు.