నిజామాబాద్ క్రైం,నవంబర్ 30 : అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర ప్రాంతంలో వాహనాలను దొంగిలించి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితులను బుధవారం నిజామాబాద్ నగరంలో అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తన కార్యాలయంలో నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం ఎస్సై టి. సాయికుమార్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో నంబరు లేని బైక్పై అటుగా వచ్చి ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకొని విచారించినట్లు ఏసీపీ తెలిపారు. దీంతో వారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ అమీర్ ప్రస్తుతం నిజామాబాద్లోని అక్బర్ బాగ్ కాలనీలో నివాసం ఉంటున్న యువకుడితో పాటు అదే కాలనీకి చెందిన షేక్ మక్బూల్గా గుర్తించామన్నారు.
వీరు మహారాష్ట్రలోని ముథోల్ పోలీస్ స్టేషన్తో పాటు ఆర్మూర్, నవీపేట్, బోధన్ రూరల్, నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించి, వారి నుంచి దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాకు చెందిన సల్మాన్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్, ఆరో టౌన్ ఎస్సై సాయికుమార్తో పాటు సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.