నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 5 : తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని, పగటి సమయంలో రెక్కీ నిర్వహించి, రాత్రి చోరీలకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ నాగరాజు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాకు చెందిన మహేంద్ర (41), బగద్ రాజ్పుత్కు చెందిన అమర్ సింగ్ (34) కలిసి కొంతకాలం క్రితం నిజామాబాద్ జిల్లాకు వచ్చి నగర శివారులో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. పగటి సమయంలో బెడ్షీట్లు, చాటలు అమ్ముతున్నట్లు నటిస్తూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి రాత్రి సమయంలో చోరీకి పాల్పడేవారు.
మూడు నెలల క్రితం నగరంలోని అశోక్ వీధిలో నివాసం ఉంటున్న ప్రసాద్ జోషి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రెండున్నర తులాల బంగారం, రూ.40 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. లేబర్ అడ్డా వద్ద సోమవారం అనుమానాస్పదంగా కనిపించిన వీరిని టూటౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. రెండో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు, వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.7లక్షల 75 వేల విలువ చేసే 15.5 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో కేసు ఛేదనకు కృషిచేసిన ఇన్చార్జి సీఐ డి.విజయ్బాబు, టూ టౌన్ ఎస్సై ఏ.పూర్ణేశ్వర్, ఐడీ పార్టీ ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది అఫ్సర్, పవన్, స్వామి, ముజీబ్ను సీపీ నాగరాజు అభినందించారు.