ఖలీల్వాడి, జనవరి 23 : గణతంత్ర వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆయా శాఖల ప్రగతిని వివరించేలా శకటాల ప్రదర్శన, స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ జెండా గౌరవానికి భంగం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘ఈ-శ్రమ్’ పోర్టల్లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు అధికారులు కృషిచేయాలని సూచించారు. కార్మికులకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందన్నారు. అనంతరం సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు కోసం స్త్రీనిధి రుణాలు అందించే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
ప్రజావాణికి 79 ఫిర్యాదులు..
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ నారాయణరెడ్డి, డీఆర్డీవో చందర్, జడ్పీసీఈవో గోవింద్, డీపీవో జయసుధ స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను వెంటనే సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.