ఎంపీ అర్వింద్కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్
ఆర్మూర్, జూలై 19 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు దమ్ముంటే తనపై పోటీ చేసి సత్తా చాటుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఆయన ఆర్మూర్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై ఎంపీ అర్వింద్ అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. డీ అంటే ధర్మం తప్పిన.. దిమాక్ తక్కువ ఎంపీ అర్వింద్ అని ఘాటుగా విమర్శించారు. పసుపు బోర్డు, ఎర్రజొన్న పంటకు గిట్టుబాటు ధర తీసుకరాకపోవడంతోనే ఆర్మూర్మండలం ఇస్సాపల్లితోపాటు జగిత్యాల్, డిచ్పల్లి, బోధన్లో ఎంపీపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, దేవుడని పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి మానసిక పరిస్థితి బాగోలేదని, ఎర్రగడ్డ దవాఖానలో అడ్మిట్ చేయించాలని హరీశ్రావుకు విన్నవిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ఎంపీలో మార్పు వస్తే మంచిదని, లేదంటే కేసీఆర్ అభిమానులు అర్వింద్ను తరిమికొడుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, తహసీల్దార్ వేణుగోపాల్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉండాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టం, కొనసాగుతున్న పురోగతి పనులపై ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు 24 గంటల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఎమ్మె ల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, సర్పంచులు కొత్తపల్లి లక్ష్మి, అసపురం దేవీ శ్రీనివాస్రెడ్డి, కల్లెం మోహన్రెడ్డి, సట్లపల్లి సవిత గణేశ్, సౌడ సాయిలత, దార్ల దీవెనరాజు తదితరులు పాల్గొన్నారు.