ఖలీల్వాడి, ఫిబ్రవరి 28: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. పోలీస్, రవాణా, ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. జిల్లా మీదుగా రెండు ప్రధాన జాతీయ రహదారులు వెళ్తుండడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నందున, వాటికి ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్గా పరిగణిస్తూ, ప్రమాదాలకు దారి తీస్తున్న కారణాలను గుర్తించాలన్నారు.
పోలీస్, ఆర్అండ్బీ, రోడ్డు ట్రాన్స్పోర్టు తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ జాయింట్ సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి అంశాలను గుర్తించి, వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు సహ ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు రోడ్డు భద్రత చర్యలు విధిగా పాటించేలా నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లా కేంద్రంతోపాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివైడర్లు, ఐలాండ్తో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే గుర్తించాలన్నారు. నగరంలో వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను గుర్తించాల్సిన అవశ్యకత ఉందని సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, రెడ్క్రాస్ ప్రతినిధి బి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.