నందిపేట్, ఆగస్టు 27 : బీఆర్ఎస్ది ఎప్పుడు ప్రజాపక్షమే అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. జనం గుండెల్లో చోటు, వారి ఓటు తనకే అని పేర్కొన్నారు. ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’లో భాగంగా ఆదివారం నందిపేట్ మండలం గంగాసారం గ్రామంలో పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన భారీ ర్యాలీలో జీవన్రెడ్డి బైక్ నడుపుతూ పాల్గొన్నారు. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలుకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం రేయింబవళ్లు పాలేరులా పని చేస్తానన్నారు. గ్రామం అభివృద్ధి, సంక్షేమ పథకాల మయంగా మారిందన్నారు.
గ్రామపంచాయతీకి రూ.1.35 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయని తెలిపారు. యాదవ సోదరులకు 43 యూనిట్లకు రూ.26.25 లక్షలతో 21 గొర్రెల యూనిట్లు మంజూరు చేశామని చెప్పారు. 15 కుల వృత్తుల వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రూ.6 లక్షలతో 50 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పారు. కులసంఘ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. ఆర్మూర్లో తనను ఢీకొట్టే వారు లేరన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేరగాళ్లను పోటీకి దింపుతున్నాయని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లు, హంతకులు, మోసగాళ్లు, రౌడీషీటర్లు, గ్యాంగ్స్టర్లు తనపై పోటీకి కాంగ్రెస్, బీజేపీ ముసుగేసుకొని వస్తున్నారని అన్నారు. అయినా కాంగ్రెస్, బీజేపీకి మళ్లీ భంగపాటు తప్పదన్నారు. తెలంగాణ మొత్తం గంపగుత్తగా సారు, కారు, కేసీఆర్, బీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.