ఖలీల్వాడి, అక్టోబర్ 6: సంస్కృతి, చారిత్రక వైభవాన్ని భావి తరాలకు అందించడంలో నిర్లక్ష్యం నెలకొన్నది. మహనీయుల అనుభవాలు, జ్ఞాపకాలు మరుగునపడుతున్నాయి. ఇందూరు నగరంలోని తిలక్గార్డెన్లో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాల ఆరేండ్లుగా తాళం వేసి దర్శనమిస్తోంది. తిలక్గార్డెన్లో ప్రదర్శనశాల ఉందన్న విషయాన్ని అధికారులు కూడా మరిచిపోయారు. శిథిలావస్థకు చేరి ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఇందూరు ఉత్సవాల సందర్భంగా 2001లో అప్పటి పాలానాధికారి అశోక్కుమార్ తిలక్గార్డెన్లోని టౌన్హాల్లో జిల్లా పురావస్తు ప్రదర్శన శాలను ప్రారంభించారు.
ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి శిల్పాలు, శిలాశాసనాలు, విశేష ప్రాచూర్యం పొందిన తాళపత్ర గ్రంథాలు, నాణేలను సేకరించి మ్యూజియంలో భద్రపరిచారు. వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. పర్యాటక కేంద్రంగా ప్రాచూర్యం కల్పించారు. ఒకే శిలపై 24 జైన తీర్థంకరులు, కృష్ణదేవరాయుల కాలం నాటి ఆయుధాలు ఔరంగజేబు పాలనలోని నాణేలు, నిజాం కాలం దుస్తులు, ఫిరంగులు, కత్తులు, ఇందూరుకే ప్రత్యేకంగా నిలిచే చిందు యక్షగానం వంటి జానపద కళారూపాల ఆభరణాలను ప్రదర్శనకు ఉంచారు.
ప్రణాళికా లోపం..
పురాతన భవనం కావడంతో వానకాలంలో ఉరుస్తుండేది. అపురూప గ్రంథాలు, ఆభరణాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడడంతో 2012 నుంచి 2014 వరకు మూసేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టినా సరైన ప్రణాళికా లేకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొన్నది. 2016లో అప్పటి కలెక్టర్ యోగితా రాణా ప్రదర్శనశాలను పూర్తి స్థాయిలో ముస్తాబు చేసేందుకు కృషి చేశారు. పురావస్తుశాఖ, జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో సుమారు రూ.40లక్షలతో మరమ్మతులు చేయించారు. వస్తువులను ఉంచేందుకు అవసరమైన అల్మారాలు వంటివి కొనుగోలు చేస్తామన్నారు. ఇందుకోసం టెండర్లు సైతం పిలిచినట్లు చెప్పారు. తర్వాత అటకెక్కించారు. పురావస్తు ప్రదర్శనశాల నిర్వహణకు మొదట్లో తగినంత సిబ్బంది ఉండేవారు. అనంతరం ఇక్కడ పనిచేసే ఇన్చార్జిని హైదరాబాద్కు బదిలీ చేశారు. 2018లో ఉద్యోగ విరమణ పొందిన నాల్గో తరగతి విశ్రాంత ఉద్యోగికి ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. కనీసం శాశ్వత పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ ఉండాల్సిన అవసరముంది. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. ఆకతాయిలు శిల్పాలను విరగ్గొడుతున్నారు.
నిర్వహణకు చేయాల్సినవి
అల్మారాలు కొనుగోలు చేసి అపురూప వస్తువులను పొందుపర్చాలి. శాశ్వత సిబ్బందిని నియమించాలి. పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా సందర్శించేలా ప్రోత్సహించాలి. జిల్లాస్థాయి ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శనశాల ప్రాంగణంలో సాహితీ, కళా ప్రదర్శనలు నిర్వహించాలి.
భావితరాలకు తెలియజేయాలి
ఎంతో కష్టపడి ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలకు మనదైన సంస్కృతి, చరిత్ర కళారూపాల విశిష్టతను తెలియజేసే కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రదర్శన శాలను ప్రారంభించాలని నగర వాసులు కోరుతున్నారు.