కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై సబ్బండవర్గాలు అసంతృప్తిని వ్యక్తంచేశాయి. రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని..ఎరువులపై సబ్సిడీని తగ్గించి రైతులపై భారం వేసిందని మండిపడుతున్నారు. ఉపాధి హామీ పథకం, పేదల ఆహార భద్రతలాంటి పథకాల్లో కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే రూపొందించిన బడ్జెట్గా, కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ర్టానికి కేటాయింపుల్లో మేలు చేశారని అభిప్రాయపడ్డారు. ఎప్పటిలాగే తెలంగాణ రాష్ర్టానికి మొండి చెయ్యి చూపారని పేర్కొన్నారు. పేదలకు అన్యాయం చేస్తూ, కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారని తెలిపారు.
రైతుకు ప్రాధాన్యత లేదు.
కమ్మర్పల్లి , ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రైతుకోసం ప్రోత్సాహక చర్యలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను నిర్మించింది. వాటి ఫలితాలు మాకు అందుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యత అసలే ఇవ్వకపోవడం శోచనీయం.
పేదల ‘ఉపాధి’ని దెబ్బతీసిన బడ్జెట్
బోధన్, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల కడుపుకొట్టింది. ఈ బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులను భారీగా తగ్గించింది. గతేడాది బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.89వేల కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది పేదల ఉపాధిని దెబ్బతీయడమే. గ్రామీణ పేదరికం మరింత పెరిగేలా కేంద్రం చర్యలు ఉన్నాయి. రైతులు ఉపయోగించే యూరియాపై ఈ బడ్జెట్లో రూ.15వేల కోట్ల సబ్సిడీని తగ్గించి వ్యవసాయరంగంపై వివక్షత చూపడం శోచనీయం.
– యేశాల గంగాధర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, బోధన్
పారిశ్రామిక రంగంలో పురోగతి లేదు…
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 1: దేశ పారిశ్రామిక రంగంలో పురోగతి కనిపించడం లేదు. ఇప్పటి వరకు చాలా రకాల వస్తువులు చైనా వంటి దేశాల నుంచి వస్తున్నాయి. కేంద్రం పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలు పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఇప్పటికైనా బడ్జెట్లో నిధులు పెంచి యువకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో నిరుద్యోగాన్ని తగ్గించే అవకాశం ఉన్నది. పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ధి కనిపిస్తుంది. ఇది ప్రజలకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
-మధుకర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్,ఎల్లారెడ్డి.
దిగుబడుల తగ్గింపుపై దృష్టి పెట్టలేదు..
డిచ్పల్లి, ఫిబ్రవరి 1: ఏడు లక్షల రూపాయల వరకు ఇన్కంట్యాక్స్ మినహాయిం పు ఇవ్వడం మంచి విషయమే.. అయితే ఇది కొత్త పన్ను స్లాబ్ విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఇవ్వడం సరైంది కాదు. పాత స్లాబ్, కొత్త స్లాబ్ ఏది ఎంచుకున్నప్పటికీ ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం అత్యావశ్యకం. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారతదేశం దిగుబడుల తగ్గింపుపై ప్రధానం గా దృష్టి పెట్టాలి. ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహం ఇవ్వాలి. లేకపోతే ఎగుమతులు, దిగుమతులలో భారతదేశానికి గుదిబండగా మారతాయి. స్వావలంబన భారతదేశం దిశగా మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమున్నది.
– డాక్టర్ పాత నాగరాజు ,అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్, టీయూ
ట్యాక్స్ భారం సమంజసం కాదు..
కమ్మర్పల్లి , ఫిబ్రవరి 1 : కేంద్రం బడ్జెట్లో ఉద్యోగులకు వేతన పన్నును మినహాయింపును సంవత్సరానికి రూ.7లక్షలకు పెంచుతూ ప్రతిపాదించింది. కానీ రూ.7లక్షలు దాటిన వారికి రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వరకు 5శాతం పన్ను, రూ. 6 లక్షలు నుంచి రూ 9 లక్షల వరకు 10 శాతం పన్ను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇలా ఒక చేతితో మినహాయింపు ఇచ్చి మరో చేతితో పన్నులు విధించడటం సరికాదు.
-కుంట గంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం
సంతృప్తికరంగా లేదు..
కామారెడ్డి, ఫిబ్రవరి 1: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. పేదవారు కొనే వస్తువులపై ధరలు తగ్గాలి. ఈ బడ్జెట్ను చూస్తే కొనే వస్తువులపై ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. నిరుపేదలకు అందని ద్రాక్షలాగా ఉన్నది.
-పిప్పిరి వెంకటి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
తెలంగాణను మర్చిపోయారు
నిజాంసాగర్, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టాన్ని మర్చిపోయారు. తెలంగాణకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపడంతోపాటు ఎన్నికల కోసమే కర్ణాటక రాష్ర్టానికి నిధులు కేటాయించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఉపాధి హామీ నిధుల ఊసే ఎత్తలేదు. మైనార్టీలకు కూడా నిధుల్లో సగం కుదించారు.
– ఏశయ్య, విశ్రాంత, ఉద్యోగి, నిజాంసాగర్
నిరాశే మిగిలింది
నందిపేట్, ఫిబ్రవరి 1: జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగయ్యే పసుపు పంటకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. బడ్జెట్లో పసుపు బోర్డు ప్రస్తావన అసలే రాలేదు. ఎన్నో సంవత్సరాల కల అయిన పసుపు బోర్డును కేంద్రం పూర్తిగా మరిచిపోయింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్ జిల్లా రైతులకు సమాధానం చెపాల్సిన అవసరం ఉన్నది. పసుపు పంటకు గిట్టుబాటు ధర లేక కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది.
– కోటపాటి నర్సింహ నాయుడు, రైతు నాయకుడు, ఆర్మూర్
నిరాశపరిచిన బడ్జెట్
ఖలీల్వాడి, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపైన నీళ్లు చల్లింది. రాష్ర్టాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించకపోగా రాష్ట్ర అధికారాలను గుప్పిట్లో పెట్టుకునేలా ఉన్నది. ఎంపీ అర్వింద్ మాటలకే తప్ప చేసేది ఏమీ లేదని స్పష్టమయ్యింది. బడ్జెట్లో పసుపు బోర్డు ఊసే లేదు.
– రమేశ్ బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
నామమాత్రంగా ఉంది..
ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి బలమైన బడ్జెట్ కేటాయింపులు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను సమాన స్థాయిలో ప్రోత్సహించాలి. నీటి వనరుల సద్వినియోగానికి సరైన దిశగా అడుగులు పడలేదు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపు నామమాత్రంగా ఉన్నది.
-కిరణ్కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది
రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి
నందిపేట్, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం బడ్జెట్లో ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలి. ప్రస్తుత బడ్జెట్లో రైతుల కోసం కేంద్రం పెద్దగా ఏమీ కేటాయింపులు చేయలేదు. 20శాతం కేటాయింపులు తగ్గించింది. ఇది చాలా బాధాకరం. ప్రధానంగా పసుపు రైతులకు ఎలాంటి ఊరట లేదు. రైతాంగానికి అన్యాయం చేస్తూ కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
– బద్దం సాయారెడ్డి, రైతు, తల్వేద