ఖలీల్వాడి, జనవరి 19 : నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశం లో సభ్యులు వివిధ అంశాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశం ప్రారంభంలో 15, 16వ ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో సమకూరే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందనున్న నిధులు తదితర వాటిపై జడ్పీ సీఈవో గోవింద్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రొసీడింగ్లను రద్దు చేయడంపై మోర్తాడ్ జడ్పీటీసీ గంగాధర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి అప్పటి మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంజూరు పత్రాలను అందజేశారని, వాటికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జడ్పీ సమావేశ హాలులో నేలపై బైఠాయించారు. గృహలక్ష్మి పథకాన్ని నమ్ముకొని చాలా మంది పేదలు ఉన్నారని, వారిని ఇబ్బందిపెట్టొద్దని జడ్పీ చైర్మన్, కలెక్టర్లను కోరారు.
నిబంధనలకు అనుగుణంగా గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్కు నిర్ణీత నిష్పత్తిలో నిధులు కేటాయిస్తామన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని సుమనారెడ్డి సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్ సమాధానమిస్తూ సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతుబంధు నిధులు నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చూడాలని, రైతు రుణమాఫీ విధివిధానాల ఖరారు విషయమై ఉన్నతాధికారులను సంప్రదించాలని జడ్పీచైర్మన్ విఠల్రావు జిల్లా వ్యవసాయాధికారికి సూచించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాలు సాధించేలా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో దుర్గాప్రసాద్కు సూచించారు.