అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఆధునీకరిస్తున్నది. రిజిస్టర్ల వ్యవస్థకు మంగళం పాడుతూ, ఆన్లైన్ ఆధారంగానే సేవలు అందించేలా చర్యలు చేపట్టింది. 11 రిజిస్టర్లలో పొందుపరచాల్సిన వివరాలను ఒకేచోట నమోదు చేసేలా ప్రత్యేక యాప్ను రూపొందించింది. అంగన్వాడీల సేవలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు, సరుకుల నిల్వలు.. ఇలా అన్నింటినీ ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సిబ్బందికి పనిభారం తగ్గడంతో పాటు ప్రధానంగా పారదర్శకత పెరగనుంది.
కోటగిరి, ఫిబ్రవరి 3 : అంగన్వాడీలో రిజిస్టర్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారుల, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికల వివరాలను, వారికి అందించే పౌష్టికాహారంతో పాటు ఎత్తు, కొలతలు, కేంద్రానికి వచ్చే సరుకుల వివరాలు మొత్తం ఆన్లైన్ చేయనున్నారు. ఈ సమాచారమంతా అంగన్వాడీ టీచర్లు గతంలో 11 రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉండేది. ఈ క్రమంలో రిజిస్టర్ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్ ఫోన్లను అందజేసింది. ప్రస్తుతం 11 రిజిస్టర్లలో పొందుపర్చాల్సిన వివరాల నమోదుకు ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. అంగన్వాడీ టీచర్లు అన్ని వివరాలను యాప్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీంతో సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు వివరాలను పర్యవేక్షించడానికి సులభతరమైంది.
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం ఏమేరకు అందుతుంది.? ఎక్కడైనా పంపిణీ చేయకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయా? అనే అంశాల పరిశీలనను ఇకపై ఈ యాప్లో నమోదు చేసిన వివరాల ద్వారా తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇందు కోసం ప్రభుత్వం న్యూట్రీషియన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్)అనే ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజువారీగా పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేయాల్సి ఉండడంతో పారదర్శకత పెరుగనుంది.
పౌష్టికాహార లోపంతో చిన్నారులు ఉండకూడదనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారంతోనే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, బరువు, ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. చిన్నారి ఎత్తు, బరువు, భుజం చుట్టూ కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా.. అనే వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చాలి. ఈ వివరాలతో మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు.
ఎన్హెచ్టీఎస్.. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్. అందులో ఉండే 11 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు, అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహార సమాచారంపై డీడబ్ల్యూవో అధికారులు జిల్లా కేంద్రం, పొతంగల్ మండలకేంద్రంలో అంగన్వాడీ టీచర్లకు డిసెంబర్ 27న అవగాహన కల్పించారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్, భీంగల్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్హెచ్టీఎస్ యాప్ ద్వారా ఇక నుంచి అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా నమోదవుతాయి. ఇంతకు ముందు 11 రకాల రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉండేది. ఇక నుంచి కొత్తగా వచ్చిన ఈ యాప్ ద్వారానే టీచర్లు వివరాలు నమోదు చేస్తారు. గతనెలలో యాప్పై టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు.
మణి, సూపర్వైజర్, కోటగిరి మండలం
గతంలో అంగన్వాడీ టీచర్లు 11 రకాల రిజిస్టర్లలో వివరాలను నమోదు చేసేవారు. రిజిస్టర్ల వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలుకుతూ ప్రత్యేక యాప్లో వివరాలను నమోదు చేస్తోంది. యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే మరింత పారిదర్శకత పెరుగుతుంది. ప్రతిరోజూ పౌష్టికాహారం వివరాలను రాయాల్సిన పని లేకుండా అందించిన పౌష్టికాహార వివరాలను నమోదు చేసిన వెంటనే నిల్వ వివరాలను అంగన్వాడీ టీచర్లకు నేరుగా యాప్లోనే కనిపిస్తాయి. మొబైల్ ఫోన్లో యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలను ఆన్లైన్ నమోదు చేస్తే మరింత పారదర్శకత పెరుగుతుంది. మెరుగైన సేవలు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
-సుధారాణి, డీడబ్ల్యూవో, నిజామాబాద్
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్లు తోడ్పడుతున్నాయి. ఆన్లైన్తో సిబ్బంది సమయపాలన, లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంగన్వాడీల్లో స్టాక్ వివరాలు, ప్రీస్కూల్ టైం టేబుల్ పాటించేందుకు యాప్లు ఉపయోగపడుతున్నాయి.
సుమలత, సూపర్వైజర్, పొతంగల్
అంగన్వాడీల్లో ఎన్హెచ్టీఎస్ యాప్పై ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలోని టీచర్లకు శిక్షణ పూర్తి చేశాం. ఈ నెల నుంచే అమలుకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ యాప్ ద్వారా టీచర్లకు పనిభారం తగ్గనుంది. పారదర్శకత పెరగనుంది.
-వినోద, సీడీపీవో, బోధన్