నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో ఉన్న శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో ఒక గుహలో నర్సింహాస్వామి రూపంలో వెలసిన శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.
వృత్తాకారంలోనే శంఖ చక్రధారుడిగా వెలసి దినదినం తన రూపాన్ని పెంపొందించుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాలు ఈనెల 27 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం లక్ష్మాపూర్, మల్కాపూర్(ఏ) గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా మాఘమాసంలో తదియ నుంచి అష్టమి వరకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు.
– సారంగాపూర్, ఫిబ్రవరి 9
చిన్నబిందు రూపంలో వెలసిన శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి క్రమక్రమంగా పెరుగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకున్నాడు. ఇరుకైన రాళ్ల మధ్యలో శంకు, చక్రం, వక్షస్థల, వాయాంశంపై కొలువుదీరిన శ్రీలక్ష్మీ సహిత అనంత పద్మనాభుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి నిజరూపం గుహలో ఇరుకైన రాళ్ల మధ్యలో చిన్న ఖాళీ స్థలంలో ఉంది. భక్తుల సౌలభ్యం కోసం అదే గుహలో కింది భాగంలో మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఏటా భాద్రపద మాసంలో అనంత చతుర్ధశి రోజున నిర్వహించే అనంత పద్మనాభుడి వ్రతం అత్యంత శక్తివంతమైందని భక్తుల విశ్వాసం. పవిత్రమైన దీక్షతో ఏడు శిరస్సులు కలిగిన సర్ప రూపంలో అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్ఠించి ఆ ప్రతిమను 16 నూలు పోగులతో తయారుచేసిన మాలను అలంకరించి అత్యంత పవిత్రంగా నియమ నిష్టలతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వ్రతాన్ని ఆచరిస్తారు.
ఈ నెల 27 నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానున్నాయి. మొదటి రోజు అంకురారోహణ రుత్వీకుల దీక్షాధారణ, హారతి, మంత్రపుష్పం, 28న సుప్రభాత సేవ, ధ్వజారోహణం, 29న మధ్యాహ్నం శ్రీలక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారి కల్యాణోత్సవం, మార్చి 1న డోలారోహణం, 2న రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.3న ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం, నాగవెల్లి, ద్వాదశావర్ణపూజ, సప్తావరణ పూజలు, దేవతా ఉద్వాసన, భూతబలి, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయి.
నలుగురు దాతలందించిన విరాళాలతో ఆలయ ఆవరణలో రూ.3లక్షలతో అష్టముఖి కోనేరుగా కొత్తగా నిర్మించారు. ఈ కోనేరును ఇటీవల స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గ్రామపెద్దలతో కలిసి సందర్శించారు. రూ.60లక్షలతో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆలయ ముఖ ద్వారాం నుంచి ఆలయం పైవరకు, ఆలయ ఆవరణలో సీసీ రోడ్డును నిర్మించనున్నారు.