భిక్కనూరు, డిసెంబర్ 19 : డబుల్ బెడ్ రూం ఇంటి విషయంలో గొడవకు దిగిన ఓ యువకుడు సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం సిద్ధరామేశ్వరనగర్కు చెందిన గంధం రంజిత్ డబుల్ బెడ్ రూం మంజూరు విషయమై సర్పంచ్ జనగామ శ్రీనివాస్తో మంగళవారం వాగ్వాదానికి దిగాడు. ఇంటిని మంజూరు చేయాలని నానా దుర్భాషలాడాడు. రంజిత్ తల్లి పేరిట మరో వారం రోజుల్లో ఇంటిని ఇవ్వొచ్చని..
అధికారులను కనుక్కుందామని సర్పంచ్ చెబుతుండగానే కోపోద్రిక్తుడైన రంజిత్ పెట్రోల్ తీసుకెళ్లి పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్పై పోసి తగులబెట్టాడు. సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్తులను దహనం చేయవద్దని వారించారు. అయినప్పటికీ రంజిత్ సర్పంచ్ శ్రీనివాస్పై సైతం పెట్రోల్ పోయడంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రంజిత్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.