బాన్సువాడ, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి అన్ని వర్గాల వారికి పండుగ అని, ఏదో కులానికి, వర్గానికే కాదని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశానికి వన్నె తెచ్చిన గొప్పవ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే పాలన కొనసాగుతుందన్నారు. ఆయన స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారని పోచారం గుర్తుచేశారు.