కోటగిరి,డిసెంబర్ 31: రేడియోల వాడకం బంద్ అయ్యింది.. టేప్ రికార్డర్లు మూగబోయాయి.. కెమెరా కన్ను మసకబారింది.. మణికట్టుకు అందాన్ని ఇచ్చే గడియారాలు మూలనబడ్డాయి. ఉత్తరాలు చెత్తబుట్ట దాఖలయ్యాయి.. బ్యాంకులకు వెళ్లాల్సిన పని కూడా తప్పింది. ఆహారం, నిత్యావసర సరుకులు ఇలా అన్నీ ఫోన్ ద్వారా ఇంటికే వస్తున్నాయి. అన్నింటినీ తనలో ఇముడ్చుకొని మనిషి జీవితంలో ఒక భాగమైంది సెల్ఫోన్. క్షణాల్లో ప్రపంచం మొత్తం సమాచారాన్ని మన కండ్ల ముందు ఉంచుతున్నది. ఎక్కడ, ఏం జరిగినా సెకన్ల వ్యవధిలో అందరికీ తెలుస్తున్నది ఈ సెల్ఫోన్లతో. మొబైల్ చేతిలో ఉంటే చాలు.. గంటలు నిమిషాల్లా గడుస్తున్నాయి.
బ్యాంకు సేవలూ మొబైల్లోనే..
డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని కోసం అయినా ప్రస్తుతం బ్యాంకులో అడుగు పెట్టాల్సిన పనిలేకుడా పోయింది. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో మొబైల్ ద్వారా బ్యాంకు లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. వీటితో పాటు పరీక్షల ఫలితాలు, అప్లికెషన్లు అన్నీ సెల్ఫోన్ ద్వారా చిటికెలో అవుతున్నాయి.
దుష్పరిణామాలూ ఎక్కువే..
సెల్ఫోన్ సమాజానికి ఎంత మేలు చేస్తోందో అంతే చేటు కూడా చేస్తున్నది. గతంలో యువత, విద్యార్థులు పొద్దస్తమానం మైదానంలో ఆటలాడుతూ కనిపించే వారు. దీంతో ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే కాకుండా దేహదారుఢ్యం సైతం మెరుగుపడేది. ఇప్పుడు ఓ గదిలో కూర్చుండి అరచేతితో ఆటలు ఆడుతున్నారు. కాలక్షేపం, తాత్కాలిక ఆనందం కోసం సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. బడి పిల్లలు కూడా మైదానాన్ని మరిచిపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చిన్న స్క్రీన్ను గంటలు తరబడి చూడడంతో కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మనిషి మనుగడను శాసించినంత వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతించవచ్చు కానీ వీటి దుష్పరిణామాలు పరిధిని దాటి కొత్త పుంతలు తొక్కితే మూల్యం చెల్లించుకోక తప్పదు.
కనుమరుగైన ఉత్తరాలు..
దూరంగా ఉన్న బంధుమిత్రుల సమాచారం, పిల్లల యోగక్షేమాలు, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను ఉత్తరాల ద్వారా తెలుసుకునేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ల్యాండ్ ఫోన్లు వచ్చినా.. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కానీ నేడు సెల్ఫోన్ రాకతో ఆన్లైన్లో అంతా కలుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్ వంటి యాప్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.
అరచేతిలో ప్రపంచం..
ఆండ్రాయిడ్ ఫోన్లతో అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. అన్ని రకాల దినపత్రికలతో పాటు అప్డేట్స్ తెలుసుకునే సదుపాయం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఎక్కువగా సెల్ సాయంతోనే చేస్తున్నారు. హోల్ సేల్ వస్తువుల ఆర్డర్ సైతం ఇందులోనే జరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడుతుంది. శారీరక శ్రమతో కూడుకున్న ఆటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రౌండ్లో ఆడే ఆటలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుంది.
– సత్యనారాయణ,
ప్రధానోపాధ్యాయుడు, దేశాయ్పేట్
చిన్నారులను ఫోన్లకు దూరంగా ఉంచాలి..
చిన్నారులను ఆండ్రాయిడ్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చిన్నప్పటి నుంచి ఫోన్లు వినియోగిస్తే కంటిచూపు దెబ్బ తింటుంది. పిల్లలు ఫోన్కు అలవాటు పడితే ఇక అంతే సంగతులు. ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగానికి ఎంత పని చేస్తాయో.. ఆరోగ్యాన్ని కూడా అంతే పాడుచేస్తాయి. తల్లిదండ్రులు చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిది.
– డాక్టర్ జయప్రకాశ్ పాటిల్,పిల్లల వైద్య నిపుణుడు, కోటగిరి
ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లే స్టోర్ సాయంతో వీలైనన్ని గేమ్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నది. పిల్లల చదువు కూడా ఇప్పుడు యాప్లతో ముడి పడి ఉంటున్నది. దీంతోపాటు వారికి ఇష్టమైన యాంగ్రీ బడ్స్, క్యాండీక్రష్ లాంటి అనేక ఆటలను కూడా డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. సెల్ ఫోన్లో చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడే ఆటలు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ఆటలను ఆడే సమయంలో పాయింట్స్ పెరగడంతో అందులో చూపించే ర్యాంకులతో ఉత్సాహం పెరుగుతున్నది. ఫలితంగా సెల్ఫోన్లకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం వీటి ఆధిపత్యం ఎంత ఉందంటే.. ఎవరైనా మనల్ని పలుకరించినా పట్టించుకోనంతగా.
మూగబోయిన టేప్ రికార్డర్లు..
ఒకప్పుడు రేడియో, టేప్ రికార్డర్ లేని ఇల్లు ఉండేవి కాదు. వీటితో ప్రజలు వార్తలు, నాటికలు, మధురమైన సినీ పాటలు వినేవారు. రేడియోలో వార్తలు, నాటికలు, పాడి, పంటల సాగు వివరాలు వచ్చే సమయానికి అందరూ ఒక చోట చేరేవారు. నేటి ఆధునిక ప్రపంచంలో రేడియోలు ఆగిపోయాయి. టేప్ రికార్డర్లు మూగబోయాయి. ఈ రెండింటినీ సెల్ఫోన్ తనలో చేర్చుకున్నది. పాతవే కాకుండా కొత్తగా విడుదలైన పాటలు క్షణాల్లో ఫోన్ ద్వారా ఆన్లైన్లో వస్తుండడంతో రేడియో, టేప్ రికార్డర్లను ప్రజలు మర్చిపోయారు.
కెమెరాకు తగ్గిన క్రేజ్..
గతంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏదైనా విహారయాత్రకు వెళ్లినా ఆ తీపి గుర్తులను భద్రంగా దాచుకోవడానికి కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకునేవారు. మొదట్లో రీల్, అనంతరం డిజిటల్ కెమెరాలు వచ్చాయి. నేడు సెల్ఫోన్లు ఆ కెమెరాలను మించిన ఫొటోలు తీస్తున్నాయి. తీరొక్క రంగులు, డిజైన్లు, గ్రాఫిక్స్ మిక్స్ చేయడమే కాకుండా క్షణాల్లో ఇతరులకు పంపించే అవకాశం, సోషల్ మీడియాలో అప్లోడ్చేసే సౌకర్యం రావడంతో జనాలకు మరింత చేరువైంది ఈ సెల్ఫోన్.