Nizamabad | కంఠేశ్వర్, ఆగస్టు 29 : నీట్ (పీజీ) పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నీట్(పీజీ) పరీక్ష కేంద్రాలను కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో నీట్(పీ.జీ) పరీక్షకు 265 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కాగా, అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్, మల్లారంలోని షిఫ్ట్ టెక్నాలజీస్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించి నిశిత పరిశీలన జరిపారు. పరీక్షా కేంద్రాల్లో సరిపడా కంపూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇత్యాది సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని గమనించారు.
విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని, పరీక్షా కేంద్రాలలో తాగునీరు, వైద్య సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. నీట్(పీజీ) పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉదయం 9.00 గంటల నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకు నీట్(పీ.జీ) పరీక్ష కొనసాగుతుందని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, డీఐఈవో రవికుమార్, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, ఏసీపీ ప్రకాశ్, తహసీల్దార్లు వినయ్ కుమార్, హరికిషోర్, కలెక్టరేట్ ఏవో బాలరాజు తదితరులు ఉన్నారు.